జగన్ పెద్ద మోసగాడు
ABN, First Publish Date - 2020-08-12T09:43:10+05:30
‘‘జగన్ పెద్ద మోసగాడు. ఆయన వైఖరితో అన్ని వర్గాల వారూ బాధపడుతున్నారు.
- అమరావతే రాజధాని అని చెప్పి మోసం
- దళితులపై దాడులపై మౌనం: హర్షకుమార్
రాజమహేంద్రవరం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్ పెద్ద మోసగాడు. ఆయన వైఖరితో అన్ని వర్గాల వారూ బాధపడుతున్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నావు. శిరోముండనం కేసులో దోషులెవరో తెలిసినా అరెస్ట్ చేయడం లేదు. అందుకే నువ్వు నాకు పెద్ద మోసగాడిగా కనిపిస్తున్నావు’’ అని సీఎం జగన్పై మాజీ ఎంపీ, దళిత నేత జీవీ హర్షకుమార్ నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల సమయంలో ప్రతీచోట, ప్రతి సందర్భంలోనూ రాజధాని అమరావతేనని చెప్పావు. అందుకే అక్కడ ఇల్లు కట్టుకున్నానన్నావు. అధికారంలోకి వచ్చాక మోసం చేశావు’’ అని ఆరోపించారు.
‘‘నీకు దమ్ము, సిగ్గు, శరం ఉంటే, నీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. నువ్వు మళ్లీ నెగ్గితే మేం అమరావతి గురించి మాట్లాడం. నీ ఇష్టం’’ అని అన్నారు. ‘‘14వ తేదీలోపు శిరోముండనం కేసులో దోషులు ఆరుగురినీ అరెస్ట్ చేయాలి. ఎస్ఐ కాల్ లిస్ట్ బయటపెట్టాలి. బాధితుడికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి. సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలికకు న్యాయం జరిగేలా దిశచట్టం కింద కేసు పెట్టాలి. వీటిని నెరవేర్చకపోతే శిరోముండనం బాధితుడు ప్రసాద్ ఇంటి వద్ద నేనే స్వాతంత్య్ర దినోత్సవంనాడు నల్లజెండా ఎగరేస్తా’’ అని హర్షకుమార్ అన్నారు.
Updated Date - 2020-08-12T09:43:10+05:30 IST