సామాజిక దూరం పాటించాలి
ABN, First Publish Date - 2020-03-30T10:16:33+05:30
రేషన్ షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు.
గుంటూరు(కార్పొరేషన్), మార్చి 29: రేషన్ షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ఆదివారం ఆమె పొత్తూరివారితోట, నందివెలుగు రోడ్డు, బాలాజీనగర్, యాదవబజారు, ఆనందపేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. పొత్తూరివారితోటలోని రేషన్ షాపు వద్ద ప్రజలు ఎక్కువగా ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుమికూడకుండా ప్రజలు ఒకరికి ఒకరు మూడు అడుగుల దూరం పాటించాలన్నారు.
రేషన్ డీలర్లు కూడా ప్రజలను ఎక్కువ సేపు నిలబడనీయకుండా త్వరితగతిన రేషన్ అందజేసి పంపాలన్నారు. నందివెలుగు రోడ్డు, బాలాజినగర్లో చికెన్ షాపుల వద్ద ఎక్కువగా ప్రజలు ఉన్న షాపులను మూసివేయించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఆనందపేటలో నిర్వహిస్తున్న డిస్ ఇన్ఫెక్షన్ పనులను తనిఖీ చేశారు. కంటోన్మెంట్ జోన్ పరిధిలోని ప్రతి వీధిలో ట్యాంకర్లతో, ప్రతి ఇంటి గేటు, గోడలపై మలేరియా విభాగ సిబ్బందితో సోడియం హైపో క్లోరైడ్, బ్లీచింగ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారన్నారు. బయట ప్రాంతాల నుంచి నగరంలోకి ఎవరు రాకుండా ట్రాఫిక్ డివైడర్ దిమ్మెలను అడ్డుగా పెట్టామన్నారు. ఆమె వెంట బయాలజిస్ట్ ఓబులు తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-03-30T10:16:33+05:30 IST