దివ్వెల.. దీపావళి
ABN, First Publish Date - 2020-11-14T04:35:47+05:30
అజ్జానమనే చీకటి నుంచి జ్ఞానమనే కాంతిబాట పట్టించే సాధనం దీపం. చెడు మంచి గెలుపొందిన సందర్భం దీపావళి పర్వదినం. సమాజానికి యువతరం దీపస్తంభంగా నిలవాలనేది దివ్య దీప్తుల దీపావళి పరమార్థం.
నేడు వెలుగుల పండుగ
పండుగపై కరోనా పడగ
కానరాని టపాకాయల సందడి
అజ్జానమనే చీకటి నుంచి జ్ఞానమనే కాంతిబాట పట్టించే సాధనం దీపం. చెడు మంచి గెలుపొందిన సందర్భం దీపావళి పర్వదినం. సమాజానికి యువతరం దీపస్తంభంగా నిలవాలనేది దివ్య దీప్తుల దీపావళి పరమార్థం. పాతరోతను వదింలించుకొని, సద్గుణ సంపత్తిని ధరించడంతోనే ఆనంద దీపావళికి అసలైన ఆహ్వానం. అప్పుడే జీవితం వెలుగుమయం. దివ్వెల పండుగ దీపావళి కులమతాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ. అయితే ఈ సారి దివ్వెల పండుగపై కరోనా పడగ పడింది. దీపావళి సందడి అంతగా కనిపించడంలేదు.
(ఆంధ్రజ్యోతి, గుంటూరు)
దీపావళి అంటేనే పిల్లల పండుగ. టపాకాయల మోతలతో.. దీపాల వెలుగులతో సందడిగా ఉంటుంది. శనివారమే దీపావళి పండుగ. ప్రతీ ఏడాది వారం ముందు నుంచే దీపావళి సందడి ఉండేది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి ఎక్కడా కానరాలేదు. ప్రధానంగా పిల్లలు టపాసులు కాల్చడానికి ఉత్సాహం చూపుతారు. అయితే ఈ ఏడాది దీపావళిపై కరోనా పడగ పడింది. మూడు నెలల లాక్డౌన్తో పలు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ పరిస్థితి కూడా పండుగ జరుపుకోవడంలో కనపడుతుంది. ఏదో పిల్లల ఆనందం కోసం ‘మమ’ అనిపించాలని పెద్దలు భావిస్తున్నారు. దీంతో పెద్దగా సందడి కనిపించడం లేదు. దీపాలంకరణకు అవసరమైన సామాగ్రి, పూలు, మిఠాయిలు తదితరాలు మార్కెట్లో సిద్ధమయ్యాయి. శుక్రవారమే పలు ప్రాంతాల్లో వ్యాపారులు దుకాణాలను విద్యుత్ దీపాలు, బంతి పూలతో అలంకరించారు. ఇంటిని దీపాలతో అలంకరించిన గృహిణులు లక్ష్మీదేవికి స్వాగతం పలికారు. దీపావళి సందర్భంగా పూలకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో కేజీ బంతి పూలు రూ.70 నుంచి 120 వరకు ధర పలికింది. పూల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రమిదల్లో నాటికి నేటికి ఎంతో తేడా వచ్చింది. వైవిద్యమైన ప్రమిదలు మార్కెట్ను ముంచెత్తాయి.
ప్రభుత్వ ఆంక్షలతో బేజారు
దీపావళి సందడి మార్కెట్లో కనిపించటం లేదు. పండుగకు మరొక్క రోజు మాత్రమే గడువున్నప్పటికీ టపాసుల దుకాణాలు, వ్యాపారాల సందడి కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఒక వైపు ప్రభుత్వాల ఆంక్షలు, మరో వైపు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఈ ఏడాది దీపావళి వ్యాపారాలపై చూపుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాల ప్రకారం బాణాసంచా కాల్చేందుకు కేవలం రెండు గంటలు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని నిబంధన విధించటం కూడా అటు బాణాసంచా వ్యాపారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. కేవలం కాలుష్య రహిత టపాసులు మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం సూచించింది. ఇలా అనేక ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి వ్యాపారం 50 శాతం కూడా జరిగే అవకాశం ఉందో లేదోనని ఆందోళన వ్యాపారవర్గాల్లో నెలకొంది.
కాలుష్య రహిత బాణాసంచా కాల్చాలి : అర్బన్ ఎస్పీ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ప్రజలంతా కాలుష్య రహిత బాణాసంచా మాత్రమే కాల్చాలని అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. దీపావళి పండుగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల మద్య మాత్రమే బాణాసంచా కాల్చాలన్నారు. జనావాసాల మధ్య కాల్చరాదన్నారు. జిల్లాలో తాత్కాలిక బాణాసంచా విక్రయాలకు అనుమతులు పొందిన వారు మాత్రమే నిర్ణీత ప్రాంతంలో విక్రయాలు జరుపుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేసి ఎవరైనా జనావాసాల మధ్య విక్రయాలు జరిపితే చర్యలు తప్పవన్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే 101కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
Updated Date - 2020-11-14T04:35:47+05:30 IST