కరోనా..అక్రమాలు
ABN, First Publish Date - 2020-05-09T07:42:57+05:30
జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలైన దాచేపల్లి, నారాయణపురం, అచ్చంపేట, క్రోసూరు, వెనిగండ్ల, కర్లపాలెం, పెదకాకాని, ఉప్పలపాడు, కేశానుపల్లి, వంకాయలపాడు, ఈపూరు తదితర గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్
క్లిష్ట సమయంలో పంచాయతీలపై నిర్లక్ష్యం
పంచాయతీల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు
నాణ్యతలేని బ్లీచింగ్, సున్నం, ఫినాయిల్ సరఫరా
డీపీవో కార్యాలయ కేంద్రంగా అక్రమాలపై ఫిర్యాదులు
గుంటూరు, మే 8: జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలైన దాచేపల్లి, నారాయణపురం, అచ్చంపేట, క్రోసూరు, వెనిగండ్ల, కర్లపాలెం, పెదకాకాని, ఉప్పలపాడు, కేశానుపల్లి, వంకాయలపాడు, ఈపూరు తదితర గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ విస్తరించింది. ఇంత క్లిష్ట సమయంలో కూడా జిల్లా పంచాయతీ(డీపీవో) పరిధిలో ఇన్చార్జులతో పాలన కొనసాగుతుంది. ప్రధానంగా గుంటూరు, తెనాలి, నరసరావుపేట డివిజన్ కేంద్రాల్లోని డీఎల్పీవో పోస్టుల్లో ఇన్చార్జులు కొనసాగుతున్నారు. ఈ కేంద్రాల్లో ఈవోపీఆర్డీలకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్లోని డీపీవో కార్యాలయంలో డీఎల్పీవో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందగా సూపరింటెండెంట్ సెలవులో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది అధికారులు అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులతో కరోనా వైరస్ నివారణ చర్యలకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఆదేశాలకు అనుగుణంగా డీపీవో కార్యాలయంలోని కొందరు బినామీ కాంట్రాక్టు అవతారం ఎత్తి అక్రమాలకు తెరలేపారనే విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సామగ్రిని పంచాయతీలకు అంటకడుతున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి పంచాయతీకి బ్లీచింగ్, సున్నం, ఫినాయిల్, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, సోడియం హైపోక్లోరైడ్, స్ర్పేయర్లను పంపుతున్నారు. వీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్లు పంచాయతీల్లోని అధికారులు భావిస్తున్నారు. అయితే జిల్లాలోని 1,050 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.80 కోట్లు విడుదలకాగా ఇందులో నుంచి సుమారు రూ.15 కోట్ల వరకు కరోనా నివారణ సామగ్రికి ఖర్చు చేస్తున్నారని సమాచారం.
డీపీవో కార్యాలయం టెండర్ల విధానాన్ని తిలోదకాలు ఇచ్చి కరోనా సామగ్రిని పెద్దఎత్తున కొనుగోలు చేసింది. దీర్ఘకాలంగా పంచాయతీలకు వివిధ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లు తమకు ఆర్డర్లు ఇవ్వక పోవడంతో ఈ అక్రమాలపై అధికారులకు, నిఘా సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పిడుగురాళ్ల కేంద్రంగా బ్లీచింగ్ తయారీ కంపెనీ ఉన్నట్లు రికార్డులు సృష్టించి పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేశారు. కొంతమంది దీనిపై ఫిర్యాదు చేయగా విజిలెన్స్ అధికారులు ఇటీవల దాడులు చేశారు. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనివ్వకుండా డీపీవో కార్యాలయంలోని కొంతమంది వ్యవహారాన్ని సెటిల్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మేం చెప్పిన వారి వద్దనే కొనుగోలు చేయాలి
గ్రామ పంచాయతీల్లో కరోనా నివారణకు అవసరమైన పరికరాలు, మందులను మేం చెప్పిన వారి వద్దనే కొనుగోలు చేయాలని డీపీవో కార్యాలయం నుంచి కీలక అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. పంచాయతీ ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు చెప్పకుండానే నేరుగా గ్రామాలకు ఆయా సామగ్రిని పంపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సరుకు లేకుండానే బిల్లులు డ్రా చేస్తున్నట్లు... మరికొన్ని దగ్గర్ల తక్కువ సరుకు పంపి ఎక్కువ సరుకు కొన్నట్లు బిల్లులు డ్రా చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
డీఎల్పీవో, డీపీవో కార్యాలయంలో పైరవీలు
జిల్లా, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఈ నెల 20న పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని డీపీవో, తెనాలి, గుంటూరు, నరసరావుపేటల్లోని డీఎల్పీవో కార్యాలయాల్లో డిప్యూటేషన్లపై సుమారు 50 మంది కొనసాగుతున్నారు. అయితే కమిషనర్ ఆదేశాలు ఇంతవరకు అమలు కాలేదు. రెండు నెలల క్రితం చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఆయా కార్యాలయాల్లో ఎన్నికల విభాగానికి సుమారు 50 మందిని డిప్యూటేషన్పై నియమించారు.
అయితే కరోనాతో ఎన్నికల ప్రక్రియ దీర్ఘకాలంగా వాయిదా పడటంతో జడ్పీ కార్యాలయంలో డిప్యూటేషన్పై ఉన్న అధికారులు, ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపారు. డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల్లో మాత్రం డిప్యూటేషన్లను రద్దు చేయకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పైరవీల కోసమే వీరిని కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలోని సుమారు 1050 పంచాయతీల్లో సిబ్బంది కొరతతో కరోనా వైరస్ నివారణ సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డిప్యూటేషన్లను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్, జేసీ దినేష్ కుమార్ల దృష్టికి తెచ్చారు.
Updated Date - 2020-05-09T07:42:57+05:30 IST