వలంటీర్లపై లాఠీదెబ్బ
ABN, First Publish Date - 2020-03-27T17:33:16+05:30
రాజమహేంద్రవరంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు..
సర్వే రిపోర్టు ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్తుండగా ఘటన
విధులు బహిష్కరించి ఆందోళన
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా గురువారం విధులు నిర్వర్తిస్తున్న వార్డు వలంటీర్లను పోలీసులు చితక బాదారు. ఈ సంఘటన స్థానిక రాజేంద్రనగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
రాజేంద్రనగర్లో వలంటీర్లు కరోనా సర్వేను పూర్తిచేసుకుని ఆ రిపోర్టును గ్రామ సచివాలయంలో ఇచ్చేందుకు వస్తుండగా అక్కడకు వచ్చిన ఏజీ ఎస్ పోలీస్ఫోర్స్ వారిని అడ్డుకుని 144 సెక్షన్ అమలులో ఉండగా గుంపులుగా తీరుగుతున్నారేంటంటూ ఒక్కసారిగా లాఠీలతో చితకబాదారు. తాము వలంటీర్లమని చెబుతున్నా పోలీసులు వినకుండా దాడి చేయడానికి నిరసిస్తూ వలంటీర్లు వారి విధులను బహిష్కరించారు. రాజేంద్రనగర్ సచివాలయంవద్ద ఆందోళనకు దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నగర వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుభ్రహ్మణ్యంలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత వలంటీర్లతో మాట్లాడారు. జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుని వలంటీర్లను తీసుకుని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటారని వలంటీర్లు నగర ప్రజల సం క్షేమం దృష్ట్యా సర్వే విధులకు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
Updated Date - 2020-03-27T17:33:16+05:30 IST