అంతా మాయ!
ABN, First Publish Date - 2020-06-07T08:21:18+05:30
ఆంధ్రప్రదేశ్ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో ర్యాంపుల వారీగా పెడుతున్న ఇసుక కోసం క్షణాల్లోనే బుకింగ్స్ పూర్తవుతున్నాయి.
ఇసుక విక్రయాల్లో ఆన్లైన్ మహేంద్రజాలం
ఐదు నిమిషాల్లోపే వెబ్సైట్ బుకింగ్స్ క్లోజ్
ఆయా ర్యాంపుల్లో ఉంచేది 300 టన్నులలోపే
ఇసుక కోసం వేల మంది వినియోగదారుల నిరీక్షణ
క్షేత్రస్థాయిలో కష్టాలు పట్టించుకోని యంత్రాంగం
అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఆందోళన
ఆన్లైన్లో కానరాని ఇసుక డంపింగ్ యార్డులు
ఏటా వేసవిలో తెరిచే ర్యాంపులకు పర్మిషనే లేదు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో ర్యాంపుల వారీగా పెడుతున్న ఇసుక కోసం క్షణాల్లోనే బుకింగ్స్ పూర్తవుతున్నాయి. ర్యాంపుల వారీగా 300 నుంచి 500 టన్నుల లోపే ఇసుక నిల్వలను చూపి ఐదు నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్ అయినట్టు చూపడంతో ఇసుక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వినియోగదారుల ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. జిల్లాల వారీగా ఉన్న ఇసుక ర్యాంపుల వివరాలతో ఏపీఎండీసీ ఆన్లైన్ బుకింగ్లను ఆహ్వానిస్తోంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే అవన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. మీ-సేవ, ఈ-సేవ, నెట్ సెంటర్లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా వేలాదిమంది వినియోగదారులు నిరంతరం ఇసుక బుకింగ్ కోసం చేస్తున్న అన్వేషణ నిష్ప్రయోజనమవుతోంది. మరో వైపు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పట్టించుకోని అధికార యంత్రాంగం చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతి రేకత వ్యక్తమవుతోంది.
ఇసుక ఆన్లైన్ మాయాజాలంతో కొంత మంది వ్యక్తులు వేలాది రూపాయలు ఆర్జిస్తున్న వారూ ఉన్నారు. ఇసుక కష్టాలపై అధికార వైఎస్సార్ సీపీకి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఏపీఎండీసీ అధికారుల సమక్షంలో ఇసుక కష్టాలపై చేసిన వ్యాఖ్యానాలు వాస్తవమైనా ప్రభుత్వ పెద్దలు, మరోవైపు జిల్లా యంత్రాంగం కౌంటర్ అటాక్లను ప్రారంభిం చింది. ఇక జిల్లాలోని 112 ఇసుక ర్యాంపుల్లో 1.12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉండగా, 32 ఇసుక ర్యాంపుల్లో 19 ర్యాంపులు పనిచేయడంలేదు.
ఎనిమిది కేంద్రాల్లో 13.74 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాకు నిల్వలు ఉన్నట్టు జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి ప్రకటించారు. ఇసుక బుక్ చేసుకున్న 85 శాతం మందికి ఇసుక రవాణా జరిగిందని వెల్లడించారు. జిల్లాలో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు 8.30 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా కాగా మరో 90 వేల మెట్రిక్ టన్నులు అందిం చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనులకు 3.72 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను బుక్చేస్తే ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని చెప్పారు. అయితే జిల్లాలో స్టాక్ పాయింట్లలో నిల్వలు గానీ, వాటి బుకింగ్స్ గురించి గానీ ఆన్లైన్ వెబ్సైట్లో ఎక్కడా కనిపించడంలేదు. ర్యాంపుల వారీగా 200 లేదా 300 టన్నులు మాత్రమే వెబ్సైట్లో పెట్టిన ఐదు క్షణా ల్లోనే బుకింగ్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇవి గత రెండు నెలల నుంచి వినియోగదారులు పడుతున్న కష్టాలే. అయితే బల్క్ ఆర్డర్ల పేరిట ఇసుక మాఫియా ముసుగులో ఉన్న కొందరు క్షణాల్లో ఆర్డర్లను దక్కించుకుని వాటిని ఆయా ప్రాంతాల్లో వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే మూడు నుంచి నాలుగు రెట్లు పెంచి విక్రయా లు చేస్తున్నారు.
ఐదు యూనిట్ల ఇసుక లారీ ధర ప్రస్తుత మార్కెట్లో రూ.30 వేల నుంచి రూ.35 వేలు పలుకు తోంది. అయినా వినియోగదారుడికి కావాల్సిన నాణ్యమైన ఇసుక లభ్యం కాని పరిస్థితి. ఏపీఎండీసీ నిబంధనల ప్రకారం టన్ను ఇసుక ధర రూ.375. నాలుగు టన్నులు కలిస్తే ఒక యూనిట్. ఐదు యూనిట్ల లారీకి ఇరవై టన్నుల ఇసుక సరఫరా చేయవలసి ఉన్నప్పటికీ లారీ కెపాసిటీని బట్టి 18 టన్నుల వరకు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. అధికారిక ధర మాత్రం 20 యూనిట్లకు రూ.7,500తో కలిపి కిరాయి, ఇతర మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇసుక కొరత నేపథ్యంలో నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ వినియోగదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఒక లారీ ఇసుక కూడా వేయించలేని పరిస్థితులలో ఉన్నామని కొందరు ఎమ్మెల్యే లే చెబుతున్నారు. తమ కేడర్ నుంచి ఇసుక కావాలంటూ ఒత్తిడి వస్తున్నా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో పడిపో యామని ఒక ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలమైనా తామే ఉన్నామని చేతులేత్తేస్తున్నారు. జిల్లాలో ఏపీఎండీసీ వెబ్సైట్ల ద్వారా బుకింగ్స్ నామమాత్రంగానే ఉండడంతో సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది.
ఇసుక నిల్వలు వినియోగదారుల అవసరాలను తీర్చే లక్ష్యానికి మించి ఉన్నట్టు మాటల ద్వారా చెబుతున్నప్పటికీ అవి ఆచరణలో కార్యరూపం దాల్చడంలేదు. జిల్లాలో ఎక్కడె క్కడ ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నాయి. అక్కడ ఇసుక బుకింగ్స్ను ఆన్లైన్లో ఎందుకు అనుమతించడంలేదో స్పష్టంచేయాలని వినియోగదారులు డిమాండు చేస్తున్నా రు. అలాగే ఏటా వేసవిలో తెరిచే ర్యాంపులు ఇప్పటివరకు ఎందుకు తెరవలేదంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొక్కు బడి తంతుగా ఆన్లైన్ మాయాజాలంతో ఇసుక విక్రయా లు దందా సాగుతోంది. ఇసుక కష్టాలపై అధికారపార్టీ ప్ర జాప్రతినిధులతోపాటు ఆ పార్టీ నాయకులు ఎన్నో అవ మానాలు, అవహేళనలకు గురవుతున్నా ప్రభుత్వ వైఖరి లో మార్పు రాకపోవడం చర్చనీయాంశమైంది.
Updated Date - 2020-06-07T08:21:18+05:30 IST