జిల్లా పోలీసు శాఖకు స్కాచ్ అవార్డు
ABN, First Publish Date - 2020-10-30T07:06:19+05:30
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మెరుగైన సేవలు అందించిన ఏపీ పోలీసుశాఖకు జాతీయ స్థాయిలో 48 స్కాచ్ అవార్డులు రాగా, ఇందులో మన జిల్లాకు ఒక అవార్డు వచ్చింది.
- గిరిజన ప్రాంతాల్లో పోలీసు సేవలకు కెపాసిటీ బిల్డింగ్ అవార్డు సాధించాం
- ఎస్పీ అద్నాన్ నయీం
కాకినాడ క్రైం, అక్టోబరు 29: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మెరుగైన సేవలు అందించిన ఏపీ పోలీసుశాఖకు జాతీయ స్థాయిలో 48 స్కాచ్ అవార్డులు రాగా, ఇందులో మన జిల్లాకు ఒక అవార్డు వచ్చింది. జిల్లాలో గిరిజన మిత్ర ప్రోగ్రాం నిర్వహణ, అమలులో పోలీసులు అందించిన ఉత్తమ సేవలకుగానూ జాతీయ స్థాయిలో అందించే స్కాచ్ అవార్డు లభించింది. గిరిజన ప్రాంతాల్లో గిరిజన మిత్ర కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ పెంపు, టెక్నాలజీ వినియోగం, కొవిడ్ నివారణ కోసం పోలీసులు అందించిన సేవలు, పోలీసు యాప్ సేవలు, దిశా యాప్ వంటి అంశాల్లో మన జిల్లా పోలీసులు ఉత్తమ సేవలు అందించినందుకు కెపాసిటీ బిల్డింగ్ అవార్డు జిల్లాకు వచ్చినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. జాతీయస్థాయిలో పోలీసు శాఖకు 48 అవార్డులు వచ్చి, ప్రథమ స్థానంలో నిలిచినందుకు డీఐజీ గౌతమ్ సవాంగ్కు, సీఎం జగన్కు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో పోలీసుశాఖపై మరింత గురుతర బాధ్యత పెరిగిందన్నారు. అవార్డు సాధించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీకు ఏఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ లు, సీఐలు అభినందనలు తెలియజేశారు.
Updated Date - 2020-10-30T07:06:19+05:30 IST