పన్నుల పెంపునకు నిరసనగా
ABN, First Publish Date - 2020-12-15T06:56:50+05:30
పేదల నడ్డి విరిచేలా పట్టణాలు, గ్రామాల్లో ఆస్తి, నీటి పన్నుల పెంపును నిరసిస్తూ పిఠాపురం పట్టణంలోని టీడీపీ భారీ అందోళన నిర్వహించింది.
పిఠాపురంలో టీడీపీ భారీ అందోళన
మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో
కమిషనరు లేకపోవడంతో రెండు గంటల పాటు సాగిన నిరసన
మాజీ ఎమ్మెల్యే వర్మ సహా పలువురు అరెస్టు
కార్యకర్తలు, పోలీసుల మద్ద తోపులాట, ఉద్రిక్తత
పిఠాపురం, డిసెంబరు 14: పేదల నడ్డి విరిచేలా పట్టణాలు, గ్రామాల్లో ఆస్తి, నీటి పన్నుల పెంపును నిరసిస్తూ పిఠాపురం పట్టణంలోని టీడీపీ భారీ అందోళన నిర్వహించింది. అపాయింట్మెంట్ ఇచ్చిన కమిషనరు అందుబాటులో లేకుండా పోవడంతో ఆగ్రహించిన వర్మ, ఇతర టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. రెండుగంటలకు పైగా అందోళన కొనసాగడంతో వర్మతో సహా పలువురు టీడీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అంతకు ముందు టీడీపీ కార్యాలయం నుంచి వర్మ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. పనులు లేకుండా జనాలు అల్లాడుతుంటే పన్నులు పెంచే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన వర్మ అక్కడ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనరు అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మునిసిపల్ కార్యాలయంలో ప్రతిదానికి ఒక రేటు పెట్టారని అన్నారు. టీడీపీ ఆందోళన ఉధృతం అవడంతో పిఠాపురం సీఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అందోళన విరమించాలని పోలీసులు సూచించగా కమిషనరు రావాల్సిందేనని వర్మ పట్టుబట్టారు. మునిసిపల్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. దీనితో వర్మను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. అనంతరం వర్మను జీపులో పిఠాపురం రూరల్ పోలీసుస్టేషన్కు తరలించారు. కొంత సేపు కార్యకర్తలు జీపును అడ్డుకున్నారు. పోలీసుస్టేషన్లో పలువురు నాయకులు వర్మకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వర్మ, ఇతర నాయకులను విడుదల చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు తమను అరెస్టు చేయడం దారుణమన్నారు.
Updated Date - 2020-12-15T06:56:50+05:30 IST