అల్లంత దూరాన...
ABN, First Publish Date - 2020-10-04T09:30:48+05:30
అల్లంత దూరాన...
రైతులకు అడంగల్ సేవలు పొందండంలో అష్టకష్టాలు
మీసేవల నుంచి సచివాలయాలకు సవరణల బదలాయింపు
సిబ్బందికి శిక్షణ లేమితో ముందుకు సాగని ప్రక్రియ
దీనికితోడు సర్వర్ సమస్యతో మరింత ఆలస్యం
సామర్లకోట, అక్టోబరు 3: రైతుల భూముల సవరణలో తీవ్ర జాప్యం వల్ల భూమి సాగుదారు లకు, భూయజమానులకు పెద్ద సమస్యగా మారింది. ఈ కారణంగానే రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవరోధంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం అడంగల్ సవరణలు మీ సేవల నుంచి సచివాలయాలకు బదలాయించడం, సచివాలయాల సిబ్బందికి అవగాహన లేకపో వడం, ఆన్లైన్ సర్వర్ సాంకేతిక లోపం వంటి అవరోధాలతో రైతులు దరఖాస్తు చేసుకుని ఎదురు తెన్నులు చూడాల్సివస్తోంది. సుదీర్ఘకాలంగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే అడంగల్ సవరణ సేవ లను తొలుత మీ సేవా కేంద్రాల ద్వారా నిర్వహించేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చిన తరువాత మీసేవ కేంద్రాల్లో అడంగల్ సవరణ సేవలు నిలిపి వేశారు. సచివాలయాల పరిధిలోనే వీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మీసేవల ద్వారా వందలాది దరఖాస్తులు రెవెన్యూ శాఖకు చేరుకున్నాయి. మీసేవ కేంద్రాల్లో వీటిని నిలిపివేసినట్టు తెలియడంతో రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తులన్నీ పక్కన పెట్టారు. అయితే ఈ విషయం తెలియని దరఖాస్తుదారులైన భూమి సాగుదారులు, భూ యజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక సచివాలయాల్లో దర ఖాస్తు చేసుకునే అంశంలో రిజిస్ట్రేషన్ ధరల పెంపుదల విషయం తెర మీదకు వచ్చింది. పన్నెండు రోజులపాటు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
అడంగల్లో సాధారణంగా సాగుదారులు, హక్కుదారులు, భూయజమానుల పేర్లలో తప్పులు దొర్లుతున్నాయి. అలాగే రెవెన్యూ సిబ్బంది పొరపాటు కారణంగా హక్కుదారుల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చినప్పుడుగానీ, ఫిక్సేషన్ మార్చాల్సి వచ్చినప్పుడుగానీ అడంగల్ సవరణల కోసం దర ఖాస్తు చేసుకుంటారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాలకు అడంగల్ సవరణలను బదలాయిం చినా అక్కడ సిబ్బందికి తగిన అవగహన లేకపోవడం, శిక్షణ అసలే లేకపోవడంతో దరఖాస్తు దారులైన రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరోవైపు సచివాలయాల్లో డిజిటల్ సేవలకు సర్వర్ సమస్యలు తొలి నుంచి ఉన్నాయి. సర్వర్ సామర్థ్యం పెంపుదలకు ఉన్నతాధికారులు సైతం సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో సచివాలయాల్లో సిబ్బందికి తలనొప్పిగా మారింది.
బాధ్యులెవరో తెలియడం లేదు : ఎల్ల వెంకట రమణ, వేట్లపాలెం
మండల పరిధి జగ్గమ్మగారిపేటలోని నా భూమికి అడంగల్ సవరణకు వీఆర్వోల చుట్టూ ఎన్నో సార్లు తిరిగాను. సర్వే చేయించుకోమన్నారు. స్ధోమత లేకపోయినా పైకం చెల్లించి సర్వేయర్తో సర్వే చేయించా. కానీ వీఆర్వో పనిపూర్తి చేయలేదు. అధికారుల తీరు చూసి విసుగుచెందాను.
Updated Date - 2020-10-04T09:30:48+05:30 IST