గోదావరి గలగల
ABN, First Publish Date - 2020-05-09T08:03:58+05:30
గోదావరి కళకళలాడుతోంది. గతేడాది ఈరోజుల్లో సుమారుగా ఇదే పరిస్థితి ఉంది. రబీ సీజన్ మధ్యలో అడుగంటిపోయిన గోదావరి క్రమంగా పెరిగింది. అవసరమైన
ఇన్ఫ్లోస్ 5177క్యూసెక్కులు
సముద్రంలోకి 5వేల 23క్యూసెక్కులు
గత ఏడాది కంటే కొంచం తక్కువ
(ఆంధ్రజ్యోతి- రాజమహేంద్రవరం): గోదావరి కళకళలాడుతోంది. గతేడాది ఈరోజుల్లో సుమారుగా ఇదే పరిస్థితి ఉంది. రబీ సీజన్ మధ్యలో అడుగంటిపోయిన గోదావరి క్రమంగా పెరిగింది. అవసరమైన సమయంలో శివారు భూములకు నీరు అందలేదు. కానీ రబీ చివరి రోజుల్లో గోదావరి నీరు క్రమం పెరగడంతో రబీ గట్టెక్కింది. అంతకుముందు దెబ్బతిన్న వరి సంగతి అంతే. ప్రస్తుతం అఖండగోదావరి నీటితో మెరుస్తోంది. పాండ్ లెవల్ 13.87 మీటర్లు ఉంది. గతేడాది ఈరోజుల్లో 13.99 మీటర్లు ఉంది. ప్రస్తుతం ఎగువ భాగం, సీలేరు నుంచి 5177 క్యూసెక్కు ఇన్ఫ్లోస్ ఉంది. డెల్టా కాల్వలు గతనెల 30వ తేదీనే కట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 5 వేల 23 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.
బ్యారేజీ దిగువ గోదావరి పాయలలోకి నీరు చేరడంతో ఇప్పటివరకూ ఎండిపోయి, ఇసుకదిబ్బలుగా మారిన పాయలు నీటితో కనిపిస్తున్నాయి. లంకలలో పనిచేసేవారికి, పశువులకు తాగునీరు ఉపయోగపడుతుంది. రావులపాలెం బిడ్జి అవతల వరకూ గోదావరి నీరు తీయగానే ఉంటుంది. తర్వాత సముద్రం అటుపోటుల వల్ల సముద్రంలోని ఉప్పునీరు గోదావరి పాయలలోకి రావడంతో అది ఉప్పగా ఉంటుంది. మే నెలాఖరి వరకూ గోదావరి ఈ తీరునే ఉండవచ్చు. వర్షాలు కురిస్తే మళ్లీ జూన్లో కాల్వలు తెరిచేసరికి గోదావరి నిండా నీరు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సీలేరు నుంచి నీరు ఆపేస్తే ప్రస్తుతం అక్కడ నుంచి వస్తున్న 2 వేల క్యూసెక్కుల నీరు ఆగిపోతుంది. దాంతో గోదావరి బ్యారేజీ లెవల్ కొంత తగ్గే అవకాశం ఉంది.
సముద్రంలోకి వదిలేసే నీరు కూడా తగ్గుతుంది. గోదావరిలో నీరు బాగానే ఉండడం వల్ల రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంత ప్రజలకు ఆనందమే. సాధారణంగా ఈరోజుల్లో సాయంకాలం గోదావరి ఒడ్డున విహరించడానికి ఇష్టపడేవారు. గోదావరిలో స్నానాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. కరోనా లాక్డౌన్ వల్ల ప్రస్తుతం గోదావరి ఒడ్డున ఎవరూ విహరించడంలేదు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచి సముద్రంలోకి నీరు వదలడంతో బ్యారేజీ దిగువన చేపల కోసం వేట మొదలైంది.
Updated Date - 2020-05-09T08:03:58+05:30 IST