గామన్ బ్రిడ్జికి ఎట్టకేలకు రిపేర్లు
ABN, First Publish Date - 2020-10-28T06:59:51+05:30
ఎట్టకేలకు గామన్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 14 కిలోమీటర్ల పొడవు గల బ్రిడ్జి ఇది. గోదావరిపై బ్రిడ్జి పొడవు 4 కిలోమీటర్లు. దివాన్చెరువు నుంచి బ్రిడ్జి వరకూ, కొవ్వూరు వైపు బ్రిడ్జి నుంచి కిందకు మొత్తం 10 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు ఉంది
- 4 నెలల పనులు.. రూ.25 కోట్ల వ్యయం : ఎంపీ
రాజమహేంద్రవరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు గామన్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 14 కిలోమీటర్ల పొడవు గల బ్రిడ్జి ఇది. గోదావరిపై బ్రిడ్జి పొడవు 4 కిలోమీటర్లు. దివాన్చెరువు నుంచి బ్రిడ్జి వరకూ, కొవ్వూరు వైపు బ్రిడ్జి నుంచి కిందకు మొత్తం 10 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు ఉంది. ఈ అప్రోచ్ నిత్యం గతుకుల మయం అవు తోంది. పెద్ద గోతుల వల్ల లారీలు సైతం పడవల్లా ఊగేవి. బీవోటీ పద్ధతిన గామన్ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించి టోల్ఫీ వసూలు చేస్తోంది. కానీ బ్యాంకుల్లో అప్పుల భారం, ఇతర సమస్యల వల్ల చాలాకాలం నుంచి మరమ్మతులు కూడా చేయడం లేదు. ఇటీవల తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. చివరకు రూ.25 కోట్లతో మరమ్మతులు చేయడానికి ఎంపీ మార్గాని భరత్రామ్ మంగళవారం దివాన్చెరువువైపు నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం 4 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయనున్నారు. ఈ పనులు పూర్తి కావడానికి నాలుగు నెలల సమయం పట్టొచ్చని అంచనా. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆర్బీజీఎల్ సంస్థ ఈ మరమ్మతులు చేస్తోందన్నారు. డిసెంబర్లోపు ఒకవైపు పనులు పూర్తి చేసి, ఫిబ్రవరిలోపు రెండో వైపు పనులు పూర్తి చేస్తామన్నారు. మొత్తం రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీవో సంజయ్ మిశ్రా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆర్అండ్బీ డీఈ రవీంద్ర, జేఈ వర్మ పాల్గొన్నారు.
Updated Date - 2020-10-28T06:59:51+05:30 IST