ఆర్ఎంసీకి రూ.500 కోట్లు
ABN, First Publish Date - 2020-12-11T06:47:42+05:30
కాకినాడ రంగరాయ వైద్యకళాశాలను బోధనా ఆసుపత్రిగా కార్పొరేట్ హంగులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నాడు-నేడు నుంచి రూ.500 కోట్లు మంజూరు చేసినట్టు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కె.వెంకటేష్ తెలిపారు.
- బోధనాసుపత్రిగా అభివృద్ధికి చర్యలు
జీజీహెచ్ (కాకినాడ), డిసెంబరు 10: కాకినాడ రంగరాయ వైద్యకళాశాలను బోధనా ఆసుపత్రిగా కార్పొరేట్ హంగులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నాడు-నేడు నుంచి రూ.500 కోట్లు మంజూరు చేసినట్టు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కె.వెంకటేష్ తెలిపారు. గురువారం ఆయన ఆర్ఎంసీ కాలేజీ, జీజీహెచ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా ఆర్ఎంసీ, జీజీహెచ్ బోధనా ఆసుపత్రిగా ఉందని, అయితే జీజీహెచ్ ఒకచోట, ఆర్ఎంసీ వైద్యకాలేజీ వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందన్నారు. వైద్యకాలేజీ విద్యార్థులకు, రోగులకు మెరుగైన వైద్యసేవల కోసం రంగరాయ వైద్యకళాశాలను పూర్తిస్థాయిలో ఒకేచోట ఉండేలా నాడు-నేడు నిధులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈమేరకు రూ.500 కోట్లను మంజూరు చేసిందన్నారు. జీజీహెచ్ అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించేందుకు త్వరలో ఏపీ మెడికల్ సొసైటీ ఇన్ప్రాస్టక్చర్ డవెలెప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. జీజీహెచ్లో ఉన్న సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు ఇక్కడే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోధనాసుపత్రి కోసం కేటాయించిన ఐటీఐ స్థలానికి సంబంఽధించి ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించారు. వీటితోపాటు మైక్రోబయాలజీ, బయో కెమిసీ్ట్ర, పెథాలజీ, నాన్టీచింగ్, టీచింగ్ వంటి భవనాల నిర్మాణాలకు ప్లానింగ్కు అధ్యయనం చేయనున్నామన్నారు. రంగరాయ వైద్యకళాశాలలో 34 ఎకరాల విస్తీర్ణంలో భవనాలను నిర్మించనున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బాబ్జి వివరించారు. దాంతో పాటు ఇక్కడే 780 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు వసతి గృహాలు, 250 మంది పీజీ వైద్య, 150 మంది హౌస్ సర్జన్ల విద్యార్థులకు వసతి గృహంతోపాటు బీఎస్సీ నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, ఆర్ఎంసీ ఏడీ శ్రీనివాసకుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T06:47:42+05:30 IST