మీరు ఇంట్లో ఉండండి.. మేం బయట ఉంటాం: డీజీపీ
ABN, First Publish Date - 2020-03-21T19:59:37+05:30
రేపటి రోజున(ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ‘‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి..మీ
అమరావతి: రేపటి రోజున(ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ‘‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి..మీ రక్షణ కోసం బయట మేముంటాం. ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపుకు స్పందిద్దాం. కరోనా వైరస్ను జయిద్దాం. జనతా కర్ఫ్యూను ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించాలి’’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు.
జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండవల్సిసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతారు కాబట్టి పోలీసులు మాత్రం అప్రమత్తతతో ఉంటారని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. ఇది స్వచ్ఛందంగా ప్రజలు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ మాత్రమేనన్నారు. డయల్ 100 ద్వారా విస్తృతంగా, నిరంతరంగా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎందుకీ జనతా కర్ఫ్యూ :
కరోనా వైరస్ ఒక ప్రదేశంలో సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుంది.
జనతా కర్ఫ్యూ 14 గంటలు పాటించడం ద్వారా కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరు స్పృశించరు.
తద్వారా అట్టి గొలుసును ఛేదించడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించడం అనేది ప్రధాన ఉద్దేశం.
కావున జనతా కర్ఫ్యూ ని ప్రజలందరూ పాటించి మన సంకల్పాన్ని చాటి చెబుదామని డీపీజీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు.
Updated Date - 2020-03-21T19:59:37+05:30 IST