మూడు రాజధానులకు మేం వ్యతిరేకం
ABN, First Publish Date - 2020-02-22T09:46:12+05:30
దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని, ఏపీ సీఎం జగన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని, ఏపీ సీఎం జగన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, దీనికి ఆర్థిక సంక్షోభం కూడా తోడవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్ ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. శుక్రవారం విజయవాడ వచ్చిన రాజాను అమరావతి జేఏసీ నాయకులు కలిసి రాజధాని అమరావతిలోనే కొనసాగాలే సహకరించాలని, జేఏసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అమరావతి జేఏసీ నాయకులు ఎ.శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, ఆర్వీ స్వామి, తదితరులతోపాటు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ రాజాను కలిశారు. అనంతరం, రాజా మాట్లాడుతూ.. మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరముందన్నారు. జాతీయస్థాయిలో ఆందోళనను ఉదృతం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ తన పతనాన్ని తనే కోరి తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు.
Updated Date - 2020-02-22T09:46:12+05:30 IST