ఈ త్రిమూర్తుల వల్లే రాష్ట్రానికి అన్యాయం: నారాయణ
ABN, First Publish Date - 2020-09-29T17:20:13+05:30
సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏబీఎన్తో మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే చట్టాన్ని రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమని మండిపడ్డారు. మోదీ కాళ్లను జగన్, చంద్రబాబు పట్టుకుంటున్నారని విమర్శించారు. పొరపాటున వ్యతిరేకిస్తే జైలుకు పోతానని జగన్ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోసర్కారు ఫ్యాక్షనిస్ట్గా మారిపోయిందని ఆరోపించారు.
రాజధానిపై తమ వైఖరి స్పష్టంగా ఉందని నారాయణ తేల్చిచెప్పారు. అమరావతే స్టేట్ క్యాపిటల్..ఇందులో మార్పు లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ మాసికం చేసుకుంటున్నాడని అన్నారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించారు. పవన్ను తాము నమ్మి బుద్ధి తక్కువ అయిందని దుయ్యబట్టారు. మోదీ కాళ్ళను పవన్ కూడా పట్టుకుంటున్నాడని అన్నారు. బీజేపీకి జగన్, పవన్, చంద్రబాబు దాసోహం అయ్యారని ఆరోపించారు. ఈ త్రిమూర్తుల వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా ఇస్తానన్న జగన్..ఇప్పుడు దణ్ణం పెట్టేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి ఏం గతి పట్టిందో జగన్ అదే గతి పడుతుందని నారాయణ హెచ్చరించారు.
Updated Date - 2020-09-29T17:20:13+05:30 IST