‘రీడింగ్’ గడువు వారమే!
ABN, First Publish Date - 2020-05-09T10:04:30+05:30
మీటర్ రీడింగ్ విధానంలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) కొత్త పద్ధతులను అనుసరిస్తోంది.
విజయవాడ, మే 8(ఆంధ్రజ్యోతి): మీటర్ రీడింగ్ విధానంలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) కొత్త పద్ధతులను అనుసరిస్తోంది. విద్యుత్ మీటర్ రీడింగ్ గడువులో కోత విధించింది. ప్రస్తుతం ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు తీస్తున్న మీటర్ రీడింగ్ను ఇక నుంచి రెండో తేదీ నుంచి పదో తేదీ లోపు ముగించాలని నిర్ణయించింది. దీనిపై మీటర్ రీడర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాలో మొత్తం ఏడు డివిజన్లు, 25 సబ్ డివిజన్లు ఉన్నాయి.
వీటి పరిధిలో 350 మంది మీటర్ రీడింగ్ తీస్తున్నారు. విజయవాడలో ఉన్న ఆరు సబ్డివిజన్ల పరిధిలో 98 మంది రీడర్లు ఉన్నారు. ఒక నెలలో వినియోగించిన విద్యుత్ యూనిట్లను ఆ తర్వాతి నెలలో లెక్కిస్తారు. తాజాగా ప్రతి నెలారెండో తేదీ నుంచి పదో తేదీ నాటికి రీడింగ్లు తీయడం, బిల్లులు జారీ చేయడం పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇటీవలే మీటర్ రీడింగ్లు తీసే కాంట్రాక్ట్ గడువు కూడా ముగియడంతో.. కొత్త కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేయడంతోపాటు రీడింగ్లో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే దీనివల్ల ఒత్తిడి పెరుగుతుందని రీడర్లు వ్యతిరేకిస్తున్నారు.
Updated Date - 2020-05-09T10:04:30+05:30 IST