ఆ భూములు వెనక్కి తీసుకోండి
ABN, First Publish Date - 2020-10-04T08:49:48+05:30
విజయపురం మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయమై ఈ ఏడాది ఆగస్టు 25న ’వైసీపీ నేతల భూ బాగోతం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది.
విజయపురం తహసీల్దార్కు జేసీ ఆదేశాలు
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
చిత్తూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): విజయపురం మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయమై ఈ ఏడాది ఆగస్టు 25న ’వైసీపీ నేతల భూ బాగోతం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అప్పట్లో స్పందించిన ఉన్నతాధికారులు స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్తో విచారణ జరిపించారు.అక్రమాలు నిజమని తేల్చిన ఆయన నివేదిక సమర్పించారు. ఆ మేరకు ఇప్పటికే మండల సర్వేయర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో 61మంది పేరిట ఉన్న 114.58 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని జేసీ మార్కొండేయులు తాజాగా విజయపురం తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివాదానికి సంబంధించి మరో 23మంది శనివారం చిత్తూరులోని జేసీ కోర్టుకు హాజరయ్యారు. వీరి పేరిట ఉన్న 50ఎకరాల భూములను వెనక్కి తీసుకోవడంపై వారంలోగా ఆదేశాలిచ్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు
విజయపురం ప్రభుత్వ భూముల అక్రమాలకు సంబంధించి ప్రధాన కారకులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది. తెరవెనుక అధికార పార్టీ నేతలు ఉండడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సాధారణంగా భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు కావాలంటే తహసీల్దార్ డిజిటల్ కీ సాయం అవసరం.
వీఆర్వో, ఆర్ఐ సిఫార్సు చేస్తేనే వీటి వివరాలను రెవెన్యూ అధికారి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే తహసీల్దార్ అడ్డుకోవాల్సి ఉంది. అయితే విజయపురం మండలంలో వైసీపీ నాయకులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలకడంతో అక్రమాలకు తెరలేచిందన్నది బహిరంగ రహస్యం. ఈ విషయం బయటికి పొక్కడంతో సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఇటీవల జేసీ మార్కొండేయులు ఆదేశాలిచ్చారు. కాగా, అధికార పార్టీ నేతల అండదండలతో కీలక పాత్రధారులు, రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి.
Updated Date - 2020-10-04T08:49:48+05:30 IST