పాల సేకరణ కేంద్రాలుగా ఆర్బీకేలు
ABN, First Publish Date - 2020-11-13T06:59:38+05:30
పాడి రైతుకు లాభమే లక్ష్యం
రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి అప్పలరాజు
మదనపల్లె రూరల్, నవంబరు 12: పాడి రైతుకు లాభమే లక్ష్యంగా ప్రభుత్వం అమూల్తో ఒప్పందం చేసుకుందని రాష్ట్రపశుసంవర్థక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. గురువారం మదనపల్లె సీఎస్ఐ జేఎంసీ కమ్యూనిటీ హాల్లో మహిళా పాల ఉత్పత్తిదారుల సహకారసంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు లీటరుకు అదనంగా రూ.4 ఇవ్వడం అమూల్ భాగస్వామ్యంలో జరగనుందన్నారు. ఇందుకు ప్రభుత్వం సుమారు రూ.2వేలకోట్లు ఖర్చు చేయనుందన్నారు. 7500 ఆర్బీకే కేంద్రాలను రూ.10లక్షలు-రూ.15లక్షల వ్యయంతో పాల ఉత్పత్తి కేంద్రాలుగా మారుస్తాన్నారు. రూ.800కోట్లతో బీఎంసీలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈనెల 20 నుంచి కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పాలసేకరణ జరుగుతుందని, రైతులకు ఈనెల 25న అదనపు చెల్లింపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. అమూల్ ఒప్పందంతో ప్రైవేటు డెయిరీలకు ఎటువంటి నష్టం లేదన్నారు. మహిళా ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో పాలసేకరణ చేయనున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ జగన్ కుల,మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమపథకాలతో న్యాయం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ భరత్గుప్తా, ఎంపీ రెడ్డెప్ప, జేసీ వీరబ్రహ్మం, ఎమ్మెల్యేలు నవాజ్బాషా, ద్వారకనాథ్రెడ్డి, వెంకటేగౌడ, సబ్కలెక్టర్ ఎం.జాహ్నవి, వెటర్నరీ జేడీ వెంకట్రావు, డ్వామా పీడీ చంద్రశేఖర్, అమూల్ ఏజీఎం అనిల్, విజయడెయిరీ డీడీ శ్రీనివాసులు, సిబ్బంది, మహిళాగ్రూపుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి రాక ఆలస్యంతో మహిళల అసహనం
ఇదిలా ఉంటే ఈ సమావేశం మదనపల్లెలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుండగా, మహిళా గ్రూపుసభ్యులను ఒంటిగంటకే తరలించారు. అయితే రాత్రి 6గంటలకు సమావేశం మొదలుకావడంతో చాలామంది మహిళలు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది మహిళలు మంత్రి రాకుండానే వెళ్లిపోయారు. అధికారులు సైతం వారిని సమావేశంలో ఉంచేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది.
Updated Date - 2020-11-13T06:59:38+05:30 IST