చలో విజయవాడను అడ్డుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2020-12-16T04:54:21+05:30
ఉపాధ్యాయ బదిలీల్లోని తప్పొప్పులపై ప్రశ్నించడానికి బయలుదేరిన ఉపాధ్యాయ సంఘ నేతలను పలమనేరు పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు.
16 మంది ఫ్యాప్టో నేతల అరెస్టు
పలమనేరు రూరల్, డిసెంబరు 15 : ఉపాధ్యాయ బదిలీల్లోని తప్పొప్పులపై ప్రశ్నించడానికి బయలుదేరిన ఉపాధ్యాయ సంఘ నేతలను పలమనేరు పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. ఉపాధ్యాయ సంఘ నేతలు విజయవాడకు తరలుతున్నారని సమాచారం అందడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పలమనేరు సీఐ జయరామయ్య, ఎస్ఐ నాగరాజుల ఆధ్వర్యంలో 16 మంది ఉపాద్యాయ సంఘ నేతలను వారి ఇళ్లవద్ద, బస్టాండుల్లో అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా కో చైర్మన్, యూటీఎఫ్ జిల్లా నాయకులు జీవీ రమణ మాట్లాడుతూ సామర్ధ్యం లేని సర్వర్తో బదిలీల కోసం జిల్లాలో ఇప్పటివరకు కేవలం 868 మంది మాత్రమే ఆప్షన్లు పెట్టుకు న్నారన్నారు. ఇక ఉంది కేవలం ఒకరోజు మాత్రమేనని తెలిపారు. ఈ ఒక్కరోజులో వేలమంది ఉపాధ్యాయులు బదిలీల ఆప్షన్లు ఎలా పెట్టుకోగలరని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్ధులు ఎక్కువగా ఉన్న చోట టీచర్ పోస్టులను విద్యాశాఖ బ్లాక్ చేయడం దారుణమన్నారు. బదిలీలపై ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో ఆ సంఘం నేతలు కృష్ణమూర్తి, హరి గోవిందయ్య, ప్రకాష్, సుబ్రహ్మణ్యం, బాబు, ప్రసన్నకుమార్, ఆనంద్ తదితరులు ఉన్నారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Updated Date - 2020-12-16T04:54:21+05:30 IST