అన్నివర్గాల సంక్షేమానికే నవరత్నాల అమలు
ABN, First Publish Date - 2020-12-30T05:38:05+05:30
అన్ని వర్గాల సంక్షేమానికే నవరత్నాలు అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి తెలియజేశారు.
వెదురుకుప్పం, డిసెంబరు 29: అన్ని వర్గాల సంక్షేమానికే నవరత్నాలు అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి తెలియజేశారు. కార్వేటినగరం మండలం పద్మసరసు, కత్తెరపల్లెలో మంగళవారం ‘నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కత్తెరపల్లెలో జరిగిన సభకు కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త హాజరయ్యారు. ఈ రెండు సభలకు డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎక్కడాలేనివిధంగా ఏపీలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2.60లక్షల ఇంటి పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారు. వీటిలో 70వేలు ఇంటి నివేశ స్థల పట్టాలైతే, మిగతా ఇంటి పట్టాలు ఇస్తున్నట్లు వివరించారు. పట్టాలు రాని వారు గ్రామ సచివాలయాల్లో వినతి పత్రాలు ఇస్తే 90 రోజుల్లో పరిష్కారం చూపుతారని చెప్పారు. కాగా చెరకు బకాయిలను చెల్లించాలని, గాజుల మండ్యం వద్ద షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్ అమరేంద్రబాబు, ఎంపీడీవో చిన్నరెడ్డెప్ప, ఈవోపీఆర్డీ వెంకటరత్నమ్మ, ఈవో నాగరత్నమ్మ, వైసీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి పుత్తూరు ధనంజయులురెడ్డి, వైసీపీ మండలాధ్యక్షుడు ధనంజయవర్మ, ముస్లిం మైనార్టీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి హమీద్ఖాన్, చిత్తూరు పార్లమెంటరీ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి ఆర్.బాలాజీనాయుడు, పీఏసీఎస్ చైర్మన్ లోకనాథరెడ్డి, రైతు నాయకుడు చిరంజీవిరెడ్డి, మురాజ్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:38:05+05:30 IST