యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
ABN, First Publish Date - 2020-11-29T05:47:36+05:30
విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా పునరుద్ధరణ పనుల కోసం రంగంలోకి ప్రత్యేకంగా 151 బృందాలు
రంగంలోకి 151 ప్రత్యేక బృందాలు
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు
తిరుపతి (ఆటోనగర్), నవంబరు 28: ‘తుఫాన్ కారణంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో పెనుగాలులు, వర్షాలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాం’ అని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు తెలిపారు. శనివారం కడప జిల్లా కోడూరు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మూడు జిల్లాల్లో 501 విద్యుత్తు సబ్స్టేషన్లపై తుఫాన్ ప్రభావం పడిందన్నారు. 534 స్తంభాలు (33 కేవీ) నేలకూలాయని, 944 ఫీడర్ల పరిధిలో 3,010 స్తంభాలు (11 కేవీ) దెబ్బతిన్నాయన్నారు. 2,813 ఎల్టీ స్తంభాలు, 890 ట్రాన్స్ఫార్మర్లు కూడా ధ్వంసమయ్యాయని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా పునరుద్ధరణ పనుల కోసం ప్రత్యేకంగా 151 బృందాలను రంగంలోకి దింపామన్నారు. ఇపటిఇకే 4,193 నివాస ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఆదివారంలోపు సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912 టోల్ఫ్రీ నెంబరుకు వినియోగదారులు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-11-29T05:47:36+05:30 IST