హలో.. ఆరోగ్యమెలా ఉంది?
ABN, First Publish Date - 2020-08-03T10:35:20+05:30
హలో.. మీ ఆరోగ్యం ఎలా ఉంది.. సరైన వైద్యం అందుతోందా.. సరైన వసతులు ఉన్నాయా? అంటూ ప్రభుత్వ విప్, తిరుపతిలో ..
కరోనా బాధితులకు చెవిరెడ్డి ఫోన్
తిరుచానూరు. ఆగస్టు 2: హలో.. మీ ఆరోగ్యం ఎలా ఉంది.. సరైన వైద్యం అందుతోందా.. సరైన వసతులు ఉన్నాయా? అంటూ ప్రభుత్వ విప్, తిరుపతిలో ఏర్పాటైన కొవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కరోనా బాధితులకు ఫోన్చేసి ఆరాతీశారు. శిల్పారామం కేంద్రంగా ఏర్పాటైన సెంట్రల్ రిసెప్షన్ నుంచి తిరుపతి పరిధిలోని వివిధ క్వారంటైన్ సెంటర్లతోపాటు హోమ్ ఐసొలేషన్లోని కరోనా బాధితులతో చెవిరెడ్డి మాట్లాడారు. ఏవైనా ఇబ్బందులుంటే శిల్పారామంలోని కాల్సెంటర్కు ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చని సూచించారు. దీనిపై పలువురు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదని.. ఇపుడీ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అంతకుముందు సమన్వయ కమిటీ సభ్యులతో చెవిరెడ్డి సమీక్షించారు. బాధితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై సానుకూలంగా స్పందించి, సమాధానం ఇవ్వాలని చెప్పారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ను ఆయన బంగ్లాలో కలిసి తమ కమిటీ సేవలను వివరించారు. దీనికి టీటీడీ నుంచి సహకారం ఇవ్వాలని కోరారు. సమన్వయ కమిటీ సభ్యులు, వైద్యులు మురళీకృష్ణ, అరుణసులోచన, కృష్ణప్రశాంతి, రవిరాజు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-03T10:35:20+05:30 IST