నోబుల్ నర్శింగ్ హోంలో తనిఖీలు
ABN, First Publish Date - 2020-02-05T23:04:46+05:30
గర్భస్థ పిండాల లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం మొత్తుకుంటున్నా, ప్రసార మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా ..
లింగ నిర్ధారణ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పీలేరు వైద్యుడు
స్కానింగ్ సెంటర్ సీజ్
చర్యలకోసం కలెక్టరుకు సిఫార్సు
పీలేరు టౌన్, ఫిబ్రవరి 4: గర్భస్థ పిండాల లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం మొత్తుకుంటున్నా, ప్రసార మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదని రుజువు చేసే సంఘటన మంగళవారం పీలేరులో జరిగింది. గర్భంలో ఉన్నది ఆడ శిశువని, వీలైనంత త్వరగా అబార్షన్ చేసుకోండని, అది కూడా తానే చేస్తానని గర్భిణికి చెబుతూ జిల్లా వైద్యాధికారులకు ఓ వైద్యుడు దొరికిపోయాడు. చిత్తూరు డిప్యూటీ డీఎంహెచ్వో, జిల్లా పీసీపీఎన్డీటీ కౌన్సిల్ సభ్యురాలు డాక్టర్ రమాదేవి కథనం మేరకు... పీలేరు ఎల్బీఎస్ రోడ్డులోని రైల్వేగేటు వద్ద డాక్టర్ జి.బాషా(రొంపిచెర్ల బాషా) నోబుల్ నర్శింగ్ హోం పేరుతో ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా లింగ నిర్ధారణ చేయడం, అబార్షన్లను ప్రోత్సహించడం, తన ఆస్పత్రిలోనే అబార్షన్లు చేయడం వంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా వైద్య శాఖాధికారులు ఆయనపై నిఘా వేశారు. గత వారంలో ఆయన ఓ గర్భిణికి అబార్షన్ చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైద్య శాఖాధికారులు డాక్టర్ బాషాపై నిఘాను మరింత పెంచారు. ఆయన మంగళవారం తన ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఉన్నతాధికారులు దాడులకు పాల్పడ్డారు. ఆయన గర్భిణికి స్కానింగ్ చేస్తూ ఆడబిడ్డ అంటూ లింగనిర్ధారణ చేసి అబార్షన్ కోసం ప్రోత్సహిస్తుండగా డాక్టర్ రమాదేవి అతనిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారుల మెరుపు దాడులకు నివ్వెరపోయిన డాక్టర్ బాషా తన తప్పును అంగీకరించారు.
అధికారులు ఆయన స్కానింగ్ సెంటర్ను తక్షణమే సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ డాక్టర్ బాషా స్కానింగ్ సెంటర్ నిర్వహణకు అనర్హుడని, తిరుపతికి చెందిన ఓ రేడియాలజిస్టు పేరుతో స్కానింగ్ సెంటర్కు అనుమతి తీసుకుని తానే స్వయంగా స్కానింగ్లు చేస్తున్నారని అన్నారు. లింగ నిర్ధారణ చేయడం, అబార్షన్కు ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, డాక్టర్ బాషాపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. అర్హత లేని వారితో వైద్య సేవలు చేయిస్తున్నారని రుజువు కావడంతో స్కానింగ్ సెంటర్తోపాటు ఆస్పత్రిని కూడా సీజ్ చేశారు. ఈ దాడుల్లో మదనపల్లె డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ లోకవర్దన్, మరికొంత మంది వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఉలిక్కిపడ్డ పీలేరు
వైద్య శాఖాధికారుల దాడుల విషయం తెలిసి పీలేరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆయన మీద చాలాకాలంగా లింగ నిర్ధారణ, అబార్షన్ల ఆరోపణలు ఉన్నప్పటికీ పీలేరుతోపాటు రొంపిచెర్ల, కలికిరి, కేవీపల్లె మండలాలకు చెందిన ప్రజలు చికిత్స పొందేవారు. ఆయన నర్శింగ్ హోం మీద దాడులు సమాచారం అందిన వెంటనే మంగళవారం ఇతర నర్శింగ్ హోంలలో స్కానింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు.
లింగ నిర్ధారణ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన డాక్టర్ బాషా 1998నుంచి పీలేరులో వైద్య సేవలందిస్తున్నారు. అంతకుమునుపు ఆయన రొంపిచెర్లలో వైద్యుడిగా సేవలందించేవారు. ఆయనపై అబార్షన్లు చేస్తారనే ఆరోపణలు చాలాకాలంగా వున్నాయి. అబార్షన్ వికటించి రోగుల పరిస్థితి విషమించడం, వారికి అంతోఇంతో ముట్టజెప్పి రాజీ చేసుకోవడం బాషాకు అలవాటేనన్న ప్రచారం వుంది. అలా ఆయన పోలీసుస్టేషన్ మెట్లు కూడా ఎక్కారని, ఈసారి మాత్రం అడ్డంగా దొరికిపోయారని చుట్టుపక్కలవారు తెలిపారు.
Updated Date - 2020-02-05T23:04:46+05:30 IST