తూర్పున దెబ్బతిన్న 213 చెరువులు
ABN, First Publish Date - 2020-12-07T07:30:34+05:30
నివర్, బురేవి తుఫాన్లతో తూర్పు ప్రాంతాల్లో శ్రీకాళహస్తి జలవనరులశాఖ పరిధిలో 213 చెరువులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
శ్రీకాళహస్తి, డిసెంబరు 6: నివర్, బురేవి తుఫాన్లతో తూర్పు ప్రాంతాల్లో శ్రీకాళహస్తి జలవనరులశాఖ పరిధిలో 213 చెరువులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీకాళహస్తి మండలంలో 31, ఏర్పేడులో 23, తొట్టంబేడులో 36, రేణిగుంటలో 7, సత్యవేడులో 28, వరదయ్యపాళెంలో 34, కేవీబీపురంలో 18, బుచ్చినాయుడు కండ్రిగలో 10, పిచ్చాటూరులో 10, నాగలాపురంలో 112, నారాయణవనంలో 4వంతున చెరువులు దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా ఇసుక బస్తాలతో రింగ్ బండ్లు వేశారు. అయినా వర్షం తగ్గకపోవడంతో దెబ్బతిన్న చెరువుల నుంచి నీరు వృథాగా పోతూనే ఉంది. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.1,02,46,000, శాశ్వత రిపేర్లకు రూ.65,39,26,000 అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు జలవనరులశాఖ ఈఈ మదనగోపాల్ తెలిపారు. కాగా, ఈ నెల 4వ తేదీ వరకు దెబ్బతిన్న చెరువులకు మాత్రమే మరమ్మతులు చేయడానికి జిల్లా జనవనరులశాఖ ఉన్నతాధికారులు అనుమతించారు. ఆ తరువాత దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేయాలంటే కలెక్టరు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కిందిస్థాయి అధికారులకు చెప్పారు. ఈ నిబంధన ఇబ్బందికరంగా ఉందని ఆశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2020-12-07T07:30:34+05:30 IST