జగన్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు: చంద్రబాబు
ABN, First Publish Date - 2020-03-16T23:20:44+05:30
సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని టీడీపీ అధినేత చంద్రబాబు హితవుపలికారు. కరోనాపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించిందన్నారు.
అమరావతి: సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని టీడీపీ అధినేత చంద్రబాబు హితవుపలికారు. కరోనాపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించిందన్నారు. కరోనా అనుమానితులను 14 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన 6777 మంది ఎక్కడున్నారో ప్రభుత్వానికి తెలుసా? అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతారా అని ఆయన నిలదీశారు. ఐసోలేషన్ వార్డులు ఎక్కడున్నాయని, కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ను ఎందుకు పట్టించుకోవడం లేదని మరోసారి ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, జగన్కు పేదల ఆరోగ్యం కంటే ఎన్నికలే ముఖ్యమా అని నిలదీశారు. కరోనా లక్షణాలతో ఇవాళ మహిళ చనిపోయిందని తెలిపారు.
జగన్, మాజీ సీఎస్ రమాకాంత్రెడ్డిని పిలిపించి ఎన్నికలు ఎలా నిర్వహించాలో అడుగుతున్నారని తెలిపారు. ఎన్నికలు పెట్టాలంటూ జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారని, జగన్, ఎన్నికల కమిషన్పై అటాక్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. కరోనా నుంచి ఎలా బయటపడాలో ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయని, అయితే ఈ ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికలు ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నారని చంద్రబాబు తప్పుబట్టారు. ఎన్నికలపై ఉన్న ధ్యాస.. కరోనా కంట్రోల్పై లేదని దుయ్యబట్టారు. ఇలాంటి సమయంలో జగన్ సీఎంగా ఉండడం మన దురదృష్టమని వ్యాఖ్యానించారు. ప్రమాదం లేదని సీఎస్ ఎలా సర్టిఫై చేస్తారని, సీఎం పేషీ ఒత్తిడితో సీఎస్ లేఖలు రాస్తారా? అని చంద్రబాబు ప్రశ్నలు సంధించారు.
Updated Date - 2020-03-16T23:20:44+05:30 IST