కోర్టుకు ఈడుస్తాం
ABN, First Publish Date - 2020-03-16T09:27:49+05:30
జగన్ మాటలు విని చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు జైలు తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
- చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు జైలే
- ‘మాచర్ల’లో పిన్నెల్లిని ఏ1గా చేర్చాలి : బుద్దా
మంగళగిరి, మార్చి 15: జగన్ మాటలు విని చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు జైలు తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పోలీస్ వ్యవస్థను జగన్ తన చెప్పుచేతల్లో పెట్టుకుని వ్యవస్థను నాశనం చేశారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా, వేసిన వారు విత్డ్రా చేసుకునేలా పోలీసులే బెదిరించారు. మాచర్లలో మాపై దాడి జరిగితే ఏ పోలీస్ అధికారీ మా వద్దకు వచ్చి రక్షణ కల్పించే విషయం అడుగకపోవడంతో పాటు కనీసం జరిగిన ఘటనపై మాతో విచారణ కూడా జరపలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయంతోనే మాపై హత్యాయత్నం జరిగింది. కానీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలి. ఏ1 నిందితునిగా చేర్చాలి. మాచర్ల ఘటనపై డీజీపీ సరిగా స్పందించలేదు. దీనికి సంబంధించిన అధికారులందరినీ కోర్టుకు ఈడుస్తాం’ అని చెప్పారు. కాగా, శునకాన్ని (జగన్) సింహాసనంపై కూర్చోబెట్టారని స్వయంగా ఒప్పుకొన్న విజయసాయికి ధన్యవాదాలు అని ప్రకటించారు.
Updated Date - 2020-03-16T09:27:49+05:30 IST