ముస్లింలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: అబ్దుల్ సుబహాన్
ABN, First Publish Date - 2020-04-02T18:49:46+05:30
ఢిల్లీ నిజాముద్దీన్లో తబ్లీగ్ జమాత్ ఇస్లామి నిర్వహణ వెనుక కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలు ఉన్నాయని
నెల్లూరు: ఢిల్లీ నిజాముద్దీన్లో తబ్లీగ్ జమాత్ ఇస్లామి నిర్వహణ వెనుక కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలు ఉన్నాయని జమాత్ ఇస్లామి హిందూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుబహాన్ అన్నారు. కేంద్రం తన నిర్లక్ష్య వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముస్లింలపై నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తబ్లీగ్ జమాత్ సమావేశం మార్చి 13, 14, 15 మూడు రోజులపాటు ఢిల్లీలో నిజాముద్దీన్లో జరిగాయన్నారు. ప్రతి ఏడాది అంతర్జాతీయ సమావేశాలు అక్కడ జరుగుతాయని తెలిపారు. జనవరి 30న కరోనా డెత్ భారత దేశంలో జరిగిందని తెలిసినప్పుడు.. ఈ సమావేశాల ద్వారా ఇంకా ప్రబలే ప్రమాదం ఉందని భావించినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ సమావేశాలను రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
సమావేశాలు నిర్వహించవద్దని మత పెద్దలను పిలిచి చెప్పామని ఢిల్లీ పోలీసులు అంటున్నారని.. అయితే చెప్పడం.. నిషేధించడంలో చాలా తేడా ఉందని సుబహాన్ అన్నారు. నిషేధిస్తే ఎవరూ సమావేశం నిర్వహించడానికి అవకాశం లేదని అన్నారు. కాగా ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటించారని, దీంతో సమాశానికి వచ్చిన 1500 మంది అక్కడే ఉండిపోయారన్నారు. తర్వాత కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇస్తే ఎక్కడివాళ్లను అక్కడకు బస్సుల్లో పంపిస్తామని మత పెద్దలు ప్రభుత్వాలకు లేఖలు రాశారని ఆయన చెప్పారు. ఇక్కడ తబ్లీగ్ జమాత్ నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదని సుబహాన్ స్పష్టం చేశారు.
Updated Date - 2020-04-02T18:49:46+05:30 IST