పోలీసు శాఖపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ABN, First Publish Date - 2020-11-27T23:20:58+05:30
రాజధానిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించడంపై ఏపీ హైకోర్టు .. పోలీసు శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి: రాజధానిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించడంపై ఏపీ హైకోర్టు .. పోలీసు శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ రైతులను 18 రోజులుగా జైల్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించింది.? ఇలా చేస్తే రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని న్యాయస్థానం పేర్కొంది. రైతుల తరపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించగా ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.
రైతులను అరెస్ట్ చేసేందుకు సరైన కారణాలు ఎందుకు చూపించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద తీసుకొనే అధికారం కోర్టుకు ఉందని తెలిపింది. రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని ఇలా చేస్తే ప్రజలు ఎక్కడకెళ్తారని హైకోర్టు పోలీసుల తీరును తప్పుబట్టింది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్ కూడా సరిగా లేదని విస్మయం వ్యక్తం చేసింది. ఇలా అయితే 'రూల్ ఆఫ్ లా' ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
Updated Date - 2020-11-27T23:20:58+05:30 IST