పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
ABN, First Publish Date - 2020-12-01T21:11:46+05:30
పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.
అమరావతి: పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎస్ఈసీ ప్రకటనపై.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల కమిషనర్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా..ఏకపక్షంగా ప్రకటన చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు.
ఎస్ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వం కర్తవ్యమని ఆ పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి..ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది.
Updated Date - 2020-12-01T21:11:46+05:30 IST