70శాతం కేసులు మర్కజ్ నుంచి వచ్చిన వారివే: సీఎం జగన్
ABN, First Publish Date - 2020-04-01T22:46:25+05:30
రెండురోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: రెండు రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని.. ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారికే పాజిటివ్ వచ్చిందన్నారు. ఢిల్లీ మీటింగ్కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి వచ్చారన్నారు. మొత్తం 585మందికి పరీక్షలు చేశాం, 70 కేసుల్లో పాజిటివ్ వచ్చిందన్నారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21మంది కోసం గాలింపు చేపట్టామన్నారు. 104కు ఫోన్ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలన్నారు.
ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ సదస్సులో పాల్గొన్నవారికి కరోనా వైరస్ సోకిందని.. ఢిల్లీ సదస్సుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ జ్వరం, ఫ్లూ లాంటిదే, ఎవరూ భయపడొద్దన్నారు. వృద్ధులు, డయాబెటిస్, ఇతర సమస్యలున్నవారికి తీవ్రంగా ఉంటుందన్నారు. కరోనా పట్ల అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దన్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుందని.. విదేశాల్లో దేశాధినేతలకు కూడా కరోనా సోకింది, నయమైందన్నారు.
Updated Date - 2020-04-01T22:46:25+05:30 IST