కన్నబాబుతో సహా ఎవరితోనైనా చర్చకు సిద్ధం: కాల్వ
ABN, First Publish Date - 2020-10-22T18:05:12+05:30
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో సహా ఎవరితోనైనా
అనంతపురం : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో సహా ఎవరితోనైనా సరే బహిరంగ చర్చకు తాను సిద్ధమని మాజీమంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు సవాల్ విసిరారు. గురువారం నాడు అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల కష్టాలు కళ్లారా చూసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారన్నారు. పత్తి, వేరుశనగతో పాటు వాణిజ్య పంటలు కూడా నష్టపోయాయని ఆయన తెలిపారు. నాలుగు నియోజకవర్గ పరిధిలో నారా లోకేష్ పర్యటన జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాలన్నీ.. రైతు దఘాకేంద్రాలుగా మారాయని మాజీ మంత్రి ఆరోపించారు.
అనంతలో లోకేష్ పర్యటన..
‘రైతులకు జరిగిన పంట నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి అంచనా వేయలేదు. దీనిపై మంత్రి కన్నబాబుతో సహా ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధం. అడుగడుగునా రైతులను మోసం చేస్తున్నారు. ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది. ప్రభుత్వ అసమర్థ విధానాలు పాలన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే సంకల్పంతో నారా లోకేష్ పర్యటన సాగుతుంది. రైతులు ప్రజా సంఘాల నేతలు టీడీపీతో కలసి రావాలి. రేపు ఉదయం 9 గంటలకు గుంతకల్లు నియోజకవర్గ నుంచి పర్యటిస్తారు. నష్టపోయిన పంటలను పరిశీలించి.. రైతులతో నేరుగా మాట్లాడుతారు. గుంతకల్లు, తాడిపత్రి, సింగనమలతో పాటు రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పర్యటన సాగుతుంది’ అని కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు.
Updated Date - 2020-10-22T18:05:12+05:30 IST