స్వీయ నియంత్రణ పాటించని జనం
ABN, First Publish Date - 2020-03-29T10:55:57+05:30
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో అధికారులు, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటు న్నా కొందరు ప్రజలు మాత్రం బాధ్యతలేకుండా ప్రవర్తిస్తు న్నారు.
సామాజిక దూరానికి మంగళం
నిబంధనల ముసుగులో యథేచ్చగా రోడ్లపైకి
పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే లాక్డౌన్ సంపూర్ణంగా అమలు
ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే కట్టడి
అనంతపురం,మార్చి28(ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో అధికారులు, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటు న్నా కొందరు ప్రజలు మాత్రం బాధ్యతలేకుండా ప్రవర్తిస్తు న్నారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి ఇళ్ల లోనే ఉండాలని చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చూపుతున్న ప్రభావాన్ని రోజూ టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకుంటూ కూడా భయంలేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ తీరును చూసి కొందరు వీళ్లింతే చస్తేగాని మారరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ ఎవరి రూపంలో ఎవరి నికాటేస్తుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొ న్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పా టించాలన్న విషయాన్ని గమనించాలి. ఇళ్లకే పరిమితం కావాలి. కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు సమయంలో సామాజిక దూరాన్ని పాటించాలి. వాటన్నిం టికి తిలోదకాలు ఇస్తున్నారంటే చావుకు ఎదురు వెళ్తున్నా రనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇచ్చిన సడలింపును చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. అనంతపురం నగరంతో పాటు అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. భయంతో, బాధ్యతతో వ్యవహరిస్తే తప్ప భవిష్యతు ఉండదన్న విష యాన్ని తెలుసుకుంటే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదని సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. పరిస్థితి చేయి దాటక ముందే ప్రభుత్వ సూచనలు పాటించడానికి మేల్కోవా ల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలోకి రావాల్సి ఉంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలి.
పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే తప్పా...
ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ ఏ విధం గా అయితే పటిష్టంగా అమలైందో అదే రీతిన లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు కావాలంటే పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే చేతిలో లాఠీ ఉంది కదా అని ఎడాపెడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కాకుండా రోడ్లపైకి ప్రజలు రాకుండా ఏ విధంగా చేయాలో ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉద యం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ సడలింపు ఉందికదా అని రోడ్లమీద ఎవరు పడితే వారు తిరుగుతుంటే చూస్తూ కూర్చోవడం కూడా మంచిది కాద న్న వాదన వినిపిస్తోంది. కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించేం దుకు పోలీసులు చేస్తున్న కృషికి మెజార్టీ ప్రజల నుంచి అభినందనలు దక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతను కట్టడి చేస్తే రోడ్లపైకి అత్యవసరమున్న వారు తప్పా ఇతరులెవ్వరూ రారు.
అధికారుల తప్పిదాలతో ప్రజలకు ఇక్కట్లు....
లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలకు స్పష్ట మైన సమాచారాన్ని చేరవేసేలా అధికారులు చర్యలు తీసు కోవాల్సి ఉంది. అయితే అధికారుల చర్యలు ఆ దిశగా లేకపోవడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. నిత్యా వసర సరుకులు, కూరగాయల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేసినప్పటికీ పత్రికలకు సమాచారం ఇవ్వడం తోనే సరిపెట్టారుగానీ.... స్థానిక ప్రజలకు తెలిసే విధంగా మైకుల్లో ప్రకటించకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు.
ఏ కాలనీ ప్రజలు ఏ మార్కెట్కు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అందరూ ఒకేసారి ఒకే మార్కెట్కు వెళ్లడంతో సామాజిక దూరాన్ని మరిచిపో యారు. అలాగే పెట్రోలు బంకులు మూతబడ్డాయి. ఏ బంకులు ఏ సమయంలో తెరుస్తారు.... ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న బంకులు ఏ ఏ రోజుల్లో ఓపెన్ చేసి ఉంచుతారన్న సమాచారం ప్రజలకు చేరవేయకపోవడంతో వాహన దారులు సైతం ఇబ్బందులు పడ్డారు. .
పాతూరు మార్కెట్లో పొంచి ఉన్న ప్రమాదం....
అనంతపురం నగరంలో కూరగాయలు, పండ్ల మార్కె ట్లను ఏడింటిని ఏర్పాటు చేశారు. అయితే ప్రజలకు ఆ మేరకు సమాచారం లేకపోవడంతో.... ప్రజలంతా పాతూ రు మార్కెట్కే గుంపులుగుంపులుగా వెళ్లారు. చివరికి మాస్క్లు కూడా వేసుకోలేదు. కూరగాయలు కొనుగోలు చేయాలన్న ఆతృతతో దుకాణాల ముందు గుమిగూడారు. ఇది జాతరను తలపించింది.
అధికారులు అప్రమత్తమై లాక్డౌన్ అమల్లో ఉన్నంత కాలం పాతూరు మార్కెట్ను పూర్తిస్థాయిలో అక్కడి నుంచి తొలగించి వేరే ప్రాంతానికి మారిస్తే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం కొనుగో లుదారుల నుంచే వ్యక్తమవుతోంది. పుట్టపర్తిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ సామాజిక దూరాన్ని ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇలా అయితే కరోనా వ్యాప్తిని అరికట్టగలమా అన్నది అధికారులు ఆలోచించాలి.
కరోనా అప్డేట్స్
అడ్మిషన్లో ఉన్నవారు : ఐదుగురు
శాంపిల్స్ సేకరణ : 40 మంది
పాజిటివ్ కేసులు : లేవు
నెగిటివ్ కేసులు : 35
రిపోర్ట్స్ పెండింగ్ : 05
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు : 1015 మంది
పట్టణ వాసులు : 550
గ్రామీణ ప్రజలు : 465
ఇప్పటి వరకూ గుర్తించినవి : 838 మంది
హోమ్ ఐసొలేషన్లో ఉన్నవారు : 838 మంది
గుర్తించని వారు : 177 మంది
14 రోజులు పర్యవేక్షణలో ఉన్నవారు : 339 మంది
28 రోజులు పర్యవేక్షణలో ఉన్నవారు : 362 మంది
28 రోజులు పూర్తి చేసుకున్న వారు : 137 మంది
అందుబాటులో ఉన్న మాస్క్లు(ఎన్-95) : 400
పీపీ కిట్స్ : 22
మాస్క్లు : 1700
గ్లౌజ్ : 1300 జతలు
క్వారంటైన్లో ఉన్నవారు : 43 మంది
హిందూపురంలో : 28 మంది
పుట్టపర్తిలో : 04 మంది
లేపాక్షి : 05 మంది
పుట్టపర్తి ఐసోలేషన్లో : 06 మంది
Updated Date - 2020-03-29T10:55:57+05:30 IST