నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యసిరి
ABN, First Publish Date - 2020-10-30T09:17:54+05:30
నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వరంగా మారింది. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించకపోయినా ఆస్పత్రుల యాజమాన్యాలు ఆ రోగి పేరుతో దండిగా డబ్బులు దండుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు
పథకం వర్తిస్తున్నా దోపిడీ చేస్తున్న ఆస్పత్రులు
ఉచిత వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు
డబ్బు వసూలు చేస్తే చర్యలంటూ హెచ్చరికలు
ప్రభుత్వ చర్యలు ఏమేరకు ఫలించేనో ?
అనంతపురం వైద్యం, అక్టోబరు 29 : నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వరంగా మారింది. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించకపోయినా ఆస్పత్రుల యాజమాన్యాలు ఆ రోగి పేరుతో దండిగా డబ్బులు దండుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సైతం ఈ దోపిడీలో భాగం పంచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. పాలకులు కూడా ఈ ఆస్పత్రులకు వత్తాసు పలకడం వల్ల దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగించారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అధికార వైసీపీ ఈ పథకానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరుపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందాలని ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొద్ది రోజులుగా పథకంపై హడావుడి సాగిస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం కూడా జిల్లాలో హడావుడి చేస్తోంది. జేసీ డాక్టర్ సిరి నేరుగా నెట్వర్క్ ఆస్పత్రుల పరిశీలనకు రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి, కోర్టు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆమె పరిశీలించారు.
ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల నుంచి అదనంగా ఫీజు వసూలు చేసినట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో నెట్వర్క్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా? రోగులకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందుతాయా? అన్న చర్చ సాగుతోంది. జిల్లాలో 65 ప్రైవేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుతున్నాయి. ఇందులో అనంతపురం నగరంలోనే 38 ఆస్పత్రులు ఉండగా మిగిలిన ఆస్పత్రులు తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరిలో ఉన్నాయి. ప్రధానంగా రేషన్ కార్డ్ ఉన్నవారు ఆరోగ్యశ్రీకి అర్హులు. వైద్యం ఉచితంగా అందించాలి. చాలా నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదు. ఆరోగ్యశ్రీ రోగులను దోచు కుంటున్నాయి. ప్రసవాలు కూడా ఉచితంగా చేయాలి. సిజేరియన్ చేస్తే రూ15వేలు, సాధారణ ప్రసవానికి రూ.8 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. నెట్వర్క్ ఆస్పత్రులు వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో వేలకు వేలు దండుకుంటున్నా యి. అలా్ట్రసౌండ్, స్కానింగ్, హెచ్ఐవీ, హెమోగ్లోబిన్ పరీ క్షల పేరుతో వేలల్లో దండుకుంటున్నారు.
కొన్ని ఆస్పత్రు లైతే ముందుగానే రూ.10 వేల నుంచి రూ.15 వేల వర కు అడ్వాన్స్ కట్టించుకుంటున్నాయి. ఇతర రోగులకు కూ డా అనేక ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించాలి కదా... అని అడిగితే అలాంటి వారికి మా ఆస్పత్రుల్లో ఆ చికిత్స చేయము వెళ్లండని చెప్పి వెనక్కు పంపిస్తున్నారు.
నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యమిత్రల అండ
రోగికి అండగా ఉండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు నియమించిన ఆరోగ్యమిత్రలు ఆ పని చే యడంలేదన్న విమర్శలున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులలో ప్రత్యేక డెస్క్లు ఉన్నా రోగుల గురించి పట్టించుకోవడం లేదు. యాజమాన్యాలే రోగులతో వ్యాపారాలు చేసుకొని యథేచ్ఛగా దోచుకుంటున్నాయి. ఆరోగ్య మిత్రలు సైతం నెట్వర్క్ ఆసుపత్రుల దోపిడీకి అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు తొలి నుంచి బలంగా ఉన్నాయి. ఇది రోగులకు మరింత అన్యాయం చేస్తోంది. \
ప్రభుత్వ ఆసత్రులలోను అంతే..!
ప్రభుత్వ ఆసత్రుల్లోను ఆరోగ్యశ్రీ కింద రోగులకు ఉచి తంగా శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందించాల్సి ఉంది. జిల్లాలో అనేక ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా ప్రస్తుతం ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. ఇందులో జిల్లా సర్వజనాస్పత్రి, హిందూపురం ఆస్పత్రి, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు పెనుకొండ, ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు అందిస్తున్నారు. ఇక్కడ కూడా వైద్యులు మనస్ఫూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందించడంలేదన్న విమర్శలున్నాయి. కొన్ని ఆస్పత్రులలో పనిచేస్తున్న వైద్యులు తమ సొంత ప్రైవేట్ ఆస్పత్రులు, కమీషన్లకు ఆశ పడి మరో ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేసి అక్కడ రోగులకు వైద్య చికిత్సలు చేసి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఆరోగ్యశ్రీ పథకం సేవలు పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
Updated Date - 2020-10-30T09:17:54+05:30 IST