వారు చెప్పిందే ధర!
ABN, First Publish Date - 2020-10-04T09:12:18+05:30
హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు పెరగకపోగా మరింత దిగజారుతున్నాయి. ఈనేపథ్యంలో గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతన్న దిగాలు చెందాల్సివస్తోంది.
వందల్లో ట్రేడర్లు..
కొనుగోళ్లు చేసేది ఐదుగురే..
పెరగని ఎండు మిర్చి ధర..
ఆందోళనలో అన్నదాతలు..
హిందూపురం, అక్టోబరు 3: హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు పెరగకపోగా మరింత దిగజారుతున్నాయి. ఈనేపథ్యంలో గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతన్న దిగాలు చెందాల్సివస్తోంది. మార్కెట్లో నెల రోజుల నుంచి మిర్చి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మర్చిని అమ్మడానికి రైతులు ఎగబడుతున్నారు. దీంతో ట్రేడర్స్, కమీషన్ ఏజెంట్లు చెప్పిందే ధరగా మారింది. ఆగస్టులో మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్ రూ.15వేలు కనిష్టంగా రూ. 8వేల దాకా ధరలు పలికాయి. అయితే శుక్రవారం మార్కెట్లో కనిష్టంగా క్వింటాల్ రూ. 5 వేలు, గరిష్టంగా 15600, సగటున రూ.9వేలు పలికినా అత్యధికంగా క్వింటాల్ రూ. 6వేలు నుంచి 9వేలు లోపే ధర పలికింది.
నెలరోజుల్లో క్వింటాల్పై సగటున రూ.4నుంచిరూ.5 వేలు ధర తగ్గినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఽప్రదానంగా మార్కెట్లో వంద మందికిపైగా ట్రేడర్స్ ఉన్నా మిర్చి కొనుగోళ్లు చేసేందుకు ట్రేడర్స్ ముందుకు రాకపోవడంతోనే ధరలు దిగజారుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మార్కెట్లో ట్రేడర్స్ను కమీషన్ ఏజెంట్లు చెప్పిందే ధర అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు వచ్చే పంట అనుగుణంగా కొనుగోళ్లు చేసే ట్రేడర్స్ను పెంచాల్సిన మార్కెట్ అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడంతో మిర్చి రైతుకు నిరాశచెందాల్సివస్తోంది.
ట్రేడర్లు చెప్పిందే వేదం..
వ్యవసాయ మార్కెట్లో లైసెన్స్డ్ ట్రేడర్లు 110 మంది ఉండగా ఐదారుగురు మాత్రమే మిర్చి కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి వారం మార్కెట్కు రైతులు భారీగా మిర్చిని తీసుకువస్తున్న నేపథ్యంలో కమీషన్ ఏజెంట్లు ట్రేడర్స్ను కొనుగోళ్లు చేయాలని బతిమాలే పరిస్థితి వచ్చింది. ట్రేడర్స్ ముందుకు రాకపోగా కమీషన్ ఏజెంట్లే ట్రేడర్లగా వ్యవహరిస్తున్నారు.
ఈనేపథ్యంలోనే మార్కెట్లో ట్రేడర్స్ రింగ్తో ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈనామ్ బెడ్డింగ్తో కొనుగోళ్లు చేయాల్సివున్నా మార్కెట్లో చేతివేలం ద్వారానే చేస్తున్నారు. పంట ను మార్కెట్కు తీసుకువచ్చిన రైతులు వెనక్కితీసుకెళ్లలేక వచ్చిన కాటికి విక్రయిస్తున్నారు. ప్రసుత్తం ధరలు చూస్తే చాలామంది రైతులకు పెట్టుబడి, కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి వస్తోంది.
Updated Date - 2020-10-04T09:12:18+05:30 IST