తామర గింజల పాయసం
ABN, First Publish Date - 2016-08-08T21:10:57+05:30
కావలసినవి: తామర గింజలు - ఒక కప్పు, పాలు - అరలీటరు, నెయ్యి - ఒక టీస్పూన్, పంచదార - నాలుగు టేబుల్ స్పూన్లు, బాదం, జీడిపప్పుల పలుకులు - ఒక్కోటి టేబుల్ స్పూన్ చొప్పున, ఎండుద్రాక్షలు
కావలసినవి: తామర గింజలు - ఒక కప్పు, పాలు - అరలీటరు, నెయ్యి - ఒక టీస్పూన్, పంచదార - నాలుగు టేబుల్ స్పూన్లు, బాదం, జీడిపప్పుల పలుకులు - ఒక్కోటి టేబుల్ స్పూన్ చొప్పున, ఎండుద్రాక్షలు - 12, సార పప్పు - ఒక టీస్పూన్ (ఇష్టమైతేనే), యాలకల పొడి - అర టీస్పూన్, కుంకుమపువ్వు - చిటికెడు.
తయారీ: అరకప్పు తామర గింజల్ని సగానికి కోయాలి లేదా గ్రైండ్ చేయాలి. మిగతా సగాన్ని గింజలుగానే ఉంచాలి. పాన్లో నెయ్యి వేడిచేసి బాదం, జీడిపప్పుల్ని వేగించాలి. తరువాత అందులోనే ఎండుద్రాక్షలు వేసి అవి ఉబ్బే వరకు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్లో తామర గింజల్ని వేసి లేత గోధుమరంగుకి వచ్చి కరకరలాడుతున్నట్టు వచ్చే వరకు గరిటెతో కలుపుతూ వేగించాలి. తరువాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరో పాన్లో పాలు పోసి వేడిచేయాలి. వేడెక్కాక స్టవ్ మంటను తగ్గించి పాల మోతాదు తగ్గేవరకు ఉంచాలి. ఆ తరువాత వేగించిన తామర గింజలు వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి. పాయసం చిక్కబడుతుండగా పంచదార వేసి ఓ నిమిషం ఉడికించాలి. అందులో యాలకలపొడి, కుంకుమపువ్వు, వేగించిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షల్లో సగాన్ని వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది. కాకపోతే తినేముందు పైన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో అలంకరించాలి. పాయసం చిక్కగా కావాలనుకుంటే మూడు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ కలుపుకోవచ్చు. తీపి ఎక్కువ కావాలనుకుంటే మరికొంచెం పంచదార కలుపుకోవచ్చు.
Updated Date - 2016-08-08T21:10:57+05:30 IST