ఏడాది కావస్తున్నా.. ఇటుక కూడా పడలేదు

ABN , First Publish Date - 2022-05-04T05:30:00+05:30 IST

మదనపల్లెలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పడలేదు.

ఏడాది కావస్తున్నా..  ఇటుక కూడా పడలేదు
ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నమూనా చిత్రం

మదనపల్లె మెడికల్‌ కాలేజి నిర్మాణమెప్పుడో!


మదనపల్లెలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పడలేదు. ఏడాది క్రితం శంకుస్థాపన చేసినా దాని గురించి ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మదనపల్లె మండలం శానిటోరియం వద్ద 95 ఎకరాల్లో రూ.475 కోట్లతో పనులు ప్రారంభించి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి 2023 నాటికి కళాశాలలో అడ్మిషన్లు పూర్తి చేస్తామని పాలకులు తెలిపారు. కానీ ఇంతవరకు కళాశాలకు కేటాయించిన భూమిని చదును కూడా చేయడం పోవడం విశేషం.


మదనపల్లె టౌన్‌, మే 4: రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ప్రభుత్వ వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసి ఏడాది అవుతున్నా..ఇంతవరకు పనులు మొదలు కాలేదు. గత ఏడాది మే 31వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసినా ఇంతవరకు మెడికల్‌ కళాశాల స్థలం చదును చేయకపోగా పిచ్చిమొక్కలను కూడా తొలగించలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలం శానిటోరియం వద్ద 95 ఎకరాల్లో రూ.475 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో కళాశాల నిర్మాణం పూర్తి చేసి 2023 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. జిల్లాలోని పడమటి ప్రాంత పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలతో పాటు అనంతపురం కదిరి, కర్ణాటకలోని శ్రీనివాసపురం తదితర ప్రాంతాల ప్రజలకు ఈ వైద్యకళాశాల ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఆకాక్షించారు. జిల్లాల విభజనలో మదనపల్లెను జిల్లా కేంద్రంగా కోల్పోయినా మెడికల్‌ కాలేజి వస్తుందని ఆశ పడ్డారు. ఇది జరిగి ఏడాది పూర్తి అవుతున్నా కేవలం పేపర్ల వరకే మెడికల్‌ కళాశాల నిర్మాణ నివేదికలు తిరుగుతున్నాయే కానీ ఇక్కడ నిర్మాణ పనులకు ఒక్క వాహనం కూడా తిరగలేదు. 


నిధులు లేక అడుగు పడని నిర్మాణ పనులు

మదనపల్లె మెడికల్‌ కాలేజి నిర్మాణానికి రూ.475 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఇందులో రూ.375 కోట్లు నాబార్డు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఈ కళాశాల నిర్మాణానికి వెచ్చించాల్సి ఉంది. ప్రభుత్వం టెండర్లు పిలవగా 28 జూన్‌ 2021 తేదీ మెగా ఇంజనీరింగ్‌ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో టెండర్‌ దక్కించుకున్న సదరు సంస్థ అగ్రిమెంటు కుదుర్చుకోలేదు. దీంతో ఏడాదిగా ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. మధ్యలో మెగా సంస్థ ప్రతినిధులు ఒకసారి వచ్చి రెవెన్యూ అధికారుల నుంచి 95 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని హద్దులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాబార్డు బృందం శానిటోరియం వద్ద మెడికల్‌ కళాశాల స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. మెడికల్‌ కళాశాలకు నిధులు మంజూరులో వాల్యూయేషన్‌ చేసినట్లు సమాచారం. ఏప్రిల్‌ 29న రాయచోటిలో కలెక్టర్‌ మదనపల్లె మెడికల్‌ కళాశాల నిర్మాణంపై మెగా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రతినిధులకు సూచనలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 


అసలుకే దిక్కులేదు...?

రాష్ట్రంలో సీఎం జగన్‌ ఏడాది క్రితం పలు మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎ్‌సఐడీసీ)  ఆధ్వర్యంలో రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మాట ఇచ్చారు. నిధుల లేమితో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు. కానీ గత నెల 29వ తేదీ ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సుకు వెళ్లిన సీఎం జగన్‌ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయను కలిశారు. ఏపీలో జిల్లాల సంఖ్య పెరిగిందని, కొత్తగా 13 జిల్లాలు ఏర్పడ్డాయని వీటికి అనుగుణంగా రాష్ట్రంలో మరో 12 కొత్త మెడికల్‌ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 2024 సంవత్సరానికి మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లను ప్రారంభిస్తామని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మెడికల్‌ కళాశాల, సత్యసాయి జిల్లాలోని పెనుగొండ మెడికల్‌ కళాశాలకు కేటాయించిన స్థలాల్లో ఎటువంటి పనులు మొదలు కాలేదు. దీనిని బట్టి చూస్తే అసలుకే దిక్కులేదు. కొత్తగా కొసరు మెడికల్‌ కళాశాలకు అనుమతులా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


వారంలో పనులు ప్రారంభిస్తాం

మదనపల్లె మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు వారం రోజుల్లో ప్రారంభిస్తాం. ఈ మేరకు మెగా ఇంజనీరింగ్‌ సంస్థతో చర్చించాము. దీనికి మెగా సంస్థ వాళ్లు ఎల్‌వోఏ (లెటర్‌ ఆఫ్‌ ఆక్సెప్టెన్సీ) ఇచ్చారు. సాధ్యమైనంత వరకు త్వరగా పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికతో ఉన్నాము.

- ధనుంజయరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఏపీఎంఎ్‌సఐడీసీ, తిరుపతి.



Read more