-
-
Home » Andhra Pradesh » Kadapa » The pond is being eroded-NGTS-AndhraPradesh
-
చెరువు మట్టి తోడేస్తున్నారు
ABN , First Publish Date - 2022-05-07T05:46:01+05:30 IST
గ్రావెల్ మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించడంతో మట్టి తరలింపునకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దారులు కనిపెట్టారు.
అనుమతి వ్యవసాయానికి
తరలించేది రియల్ ఎస్టేట్కు
ఇదో కొత్తరకం మట్టి వ్యాపారం
సంబేపల్లె, మే 6: గ్రావెల్ మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించడంతో మట్టి తరలింపునకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దారులు కనిపెట్టారు. వ్యవసాయ పొలానికి భూ సారవంతం కోసం చెరువు మట్టి పేరుతో రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకొని రియల్ ఎస్టేట్ కోసం మట్టి తరలింపు మొదలుపెట్టారు. సంబేపల్లె చెరువులోని మట్టిని అక్రమంగా శుక్రవారం తరలించారు. 15 రోజుల క్రితం ఇదే చెరువులో మట్టి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. సాధారణంగా చెరువులో మట్టి తవ్వకాల కోసం ఇరిగేషన్ అధికారులు అనుమతి తప్పనిసరి. అయితే రెవెన్యూ అధికారుల అనుమతి ఉందంటూ సంబేపల్లె చెరువు సర్వే నెంబరు 113 నుంచి చెరువు ఆనుకుని ఉన్న సర్వేనెంబరు 94/2లోని 9.40 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ కోసం మట్టిని కుప్పలు కుప్పలుగా తోలుతున్నారు. భూమి సారవంతం కోసం రెవెన్యూ అధికారులు అనుమతిస్తే వారు వేల ట్రిప్పుల మట్టిని తరలించారు. రెవెన్యూ అధికారుల అనుమతులను సాకుగా చూపి యథేచ్ఛగా పట్టపగలే ఎక్స్కవేటర్ల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా సంబేపల్లె చెరువు నుంచి వందల ట్రిప్పులు మట్టిని తరలించారు. 15 రోజుల క్రితం దేవపట్ల గ్రామంలోని జమ్మిచెట్టుకుంటలో రాత్రి సమయంలో 1000 టిప్పర్ల మట్టిని తరలించారు. దీంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకర బావులును తలపిస్తున్నాయి. అప్పట్లో ఓ వర్గం వారు మట్టి తరలింపును అడ్డుకోవడంతో నిలిపివేశారు. ఈ విషయంపై ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి వివరణ కోరగా తాము ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. రెవెన్యూ అధికారుల అనుమతి చెల్లదన్నారు. తహసీల్దార్ సత్యానందంను వివరణ కోరగా వ్యవసాయ పొలానికి సారవంతమైన మట్టి తరలించడానికి కొన్ని టిప్పులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.