అమెరికాలో తెలుగు వారి చూపు డాలస్ వైపు
ABN , First Publish Date - 2022-05-05T02:34:54+05:30 IST
అమెరికాలో నివసిస్తున్న చాలా మంది తెలుగువారు ప్రస్తుతం డాలస్ నగరం వైపు దృష్టి సారించారు. రోజుకు సగటున 10 కుటుంబాలు అమెరికా నలుమూలల నుండి
రెక్కలు విప్పు కొన్న రియల్ ఎస్టేట్ .. పెరిగిన వడ్డీ రేట్లు.
అమెరికాలో నివసిస్తున్న చాలా మంది తెలుగువారు ప్రస్తుతం డాలస్ నగరం వైపు దృష్టి సారించారు. రోజుకు సగటున 10 కుటుంబాలు అమెరికా నలుమూలల నుండి డాలస్ నగరానికి తమ నివాసాన్ని తరలిస్తున్నట్లు అంచనా. ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇక్కడ ఉండటం, ఇంటి వద్ద ఉండి పని చేసే సౌకర్యం అందుబాటులోకి రావటం, తదితర కారణాల మూలంగా డాలస్ నగరానికి తెలుగువారి రాక రోజురోజుకు అధికమవుతోంది. 10 సంవత్సరాల క్రితం డాలస్ నగరంలో 30 వేల మంది తెలుగువారు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య రెండు లక్షలకు దాటింది అని అంచనా.
రెక్కలు విప్పు కొన్న రియల్ ఎస్టేట్
ప్రస్తుతం డాలస్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు విప్పుకుంటోంది. 2 సంవత్సరాల క్రితం నాలుగు లక్షల డాలర్లు పలికిన గృహాలు ప్రస్తుతం 7 నుండి ఎనిమిది లక్షల డాలర్ల వరకు ధరలు పెరిగాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డాలస్ నగరంలో నూతన గృహ నిర్మాణం జరగటం లేదనే అభిప్రాయం ఉంది. డాలస్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకు వెళ్ళటానికి తెలుగువారి పెట్టుబడులు కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెడదామనుకున్నా వారు తమ మనస్సు మార్చుకొని డాలస్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు స్థానికంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు బ్యాంకు వడ్డీ రేట్లు కూడా భారీగా పెంచాయి.
డాలస్ నగరం హైదరాబాద్గా మారిందట
హైదరాబాద్ నగరాన్ని డాలస్ నగరంగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. తెలుగువారి ప్రాబల్యం రోజురోజుకు ఇక్కడ పెరుగుతూ ఉండటంతో డాలస్ నగరం హైదరాబాదు గా మారిందని స్థానికంగా ఉన్న తెలుగు వారు అభిప్రాయపడుతున్నారు. డాలస్ నలుమూలల తెలుగుజాతి పరిమళం గుబాళిస్తుంది.
పెట్టుబడులకు ఇది సమయం కాదు.
డాలస్లో పెట్టుబడులు పెట్టేవారు కొద్దికాలం పాటు వేచి చూడటం మంచిదని ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు మల్లవరపు అనంత్ సలహా ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గృహాల ధరలు భూముల ధరలు భారీగా పెరిగాయని, కోవిడ్ అనంతరం పెరుగుదల భారీగా కనిపిస్తోందని ఇది తాత్కాలికమేనని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలస్లో పెట్టుబడులు పెట్టడానికి తెలుగువారు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని కొంతకాలం పాటు వేచి ఉంటే మంచిదని అనంత్ అభిప్రాయం వ్యక్తపరిచారు.
డాలస్ నుండి 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ