శిఖం భూమి హాంఫట్‌

ABN , First Publish Date - 2022-05-13T05:10:06+05:30 IST

భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్‌ వ్యాపారుల కన్ను శిఖం భూములపై పడింది. గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువుల శిఖం భూములను మింగేస్తున్నారు. నంగునూరు మండల రెవెన్యూ కార్యాలయానికి రెండువందల మీటర్ల దూరంలోనే ఉన్న చౌడిచెరువు ఆక్రమణలకు గురువుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

శిఖం భూమి హాంఫట్‌
చౌడి చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చదును చేస్తున్న దృశ్యం


చెరువులను మింగేస్తున్న రియల్‌ గద్దలు

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమనిర్మాణాలు


నంగునూరు, మే 12: భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్‌ వ్యాపారుల కన్ను శిఖం భూములపై పడింది. గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువుల శిఖం భూములను మింగేస్తున్నారు. నంగునూరు మండల రెవెన్యూ కార్యాలయానికి రెండువందల మీటర్ల దూరంలోనే ఉన్న చౌడిచెరువు ఆక్రమణలకు గురువుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నంగునూరు చౌడిచెరువు పునరుద్ధరణకు నోచుకోగా కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారి, ఆయకట్ట రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువును మట్టితో నింపి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గతేడాది చౌడిచెరువు కబ్జాలపై అప్పటి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి స్పందించి అక్రమ నిర్మాణాలు తొలగించాలని తహసీల్దార్‌, ఇరిగేషన్‌ ఏఈ, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో అక్రమనిర్మాణాలను కొంతమేర కూల్చివేశారు. వెంకట్రామారెడ్డి వెళ్లిపోవడంతో ఇటీవల కాలంలో ఆ ప్రదేశంలో మళ్లీ నిర్మాణాలు జోరందుకున్నాయి. గురువారం శిఖం భూమిలో తమకు పట్టా ఉందని కొంతమంది టిప్పర్లతో మట్టిని తెప్పించి చదును చేయించారు.


నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

గ్రామంలోని 1454 సర్వే నంబర్‌లో చౌడి చెరువుకు సంబంధించి 17.05 ఎకరాల శిఖం ఉంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబందన ఉన్నా శిఖానికి సమీపంలో జోరుగా కొనసాగుతున్నాయి. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నీరు లేనప్పుడు పట్టా ఉన్నవారు పంటలు పండించుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవల చెరువులో నీరు కొంత మేర తగ్గటంతో గ్రామానికి చెందిన కొందరు తనకు పట్టాలు ఉన్నాయని నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతోనే చౌడి చెరువులో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని గ్రామస్థులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, అనుమతులు పొందకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని తహసీల్దార్‌ భూపతి హెచ్చరించారు. 


Read more