Ponguletiని రాజ్యసభకు పంపాలని KCR నిర్ణయం.. ఆసక్తి చూపని పొంగులేటి!
ABN , First Publish Date - 2022-05-13T22:12:39+05:30 IST
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ దక్కింది. ఎంపీ బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని
హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ దక్కింది. ఎంపీ బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని పొంగులేటికి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకుంది. అయితే రెండేళ్ల పదవీకాలమే ఉండటంతో పొంగులేటి ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సీఎం కేసీఆర్ నచ్చజెప్పుతున్నారు. స్వయంగా కేసీఆరే (KCR) పొంగులేటికి ఫోన్ చేశారు. రాజ్యసభకు మొదటి నుంచీ రేసులో ఓసీ సామాజిక వర్గాల నుంచి టీఆర్ఎస్ దినపత్రిక నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్, పార్టీ మాజీ కోశాధికారి డి.దామోదర్ రావు (వెలమ), హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి టీఆర్ఎస్ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, హైదరాబాద్ (Hyderabad)కు చెందిన మున్నూరు కాపు ముఖ్యుడు పీఎల్ శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
రాజ్యసభ ఎన్నికలకు వేళయింది. ఈసారి మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. ముగ్గురినీ కొత్త వారినే ఎంపిక చేస్తారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ రాజీనామాతో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం జూన్ 21వ తేదీతో పూర్తవుతోంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నాడే.. మరో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది.