North Koreaలో మొట్టమొదటి కొవిడ్ కేసు...జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన
ABN , First Publish Date - 2022-05-12T13:05:27+05:30 IST
ఉత్తర కొరియా గురువారం మొట్టమొదటి కొవిడ్ -19 కేసు నమోదవడం సంచలనం రేపింది....
సియోల్: ఉత్తర కొరియా గురువారం మొట్టమొదటి కొవిడ్ -19 కేసు నమోదవడం సంచలనం రేపింది. రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నార్త్ కొరియా దేశంలోకి రాకుండా కట్టడి చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఫస్ట్ కొవిడ్ కేసు నమోదవడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. నార్త్ కొరియాలోని ప్యోంగ్యాంగ్ నగరంలో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను పరీక్షించగా ఒకరికి కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ సోకిందని తేలింది. దీంతో నార్త్ కొరియాలో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అత్యవసర వైరస్ నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు.అత్యల్ప వ్యవధిలో కరోనా మూలాన్ని తొలగించడమే తమ లక్ష్యమని కిమ్ చెప్పారు.
ఒక్క కరోనా కేసు వెలుగుచూడటంతో నార్త్ కొరియాలోని సరిహద్దుల్లో కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో పాటు లాక్డౌన్ ప్రకటించారు. ఉత్తర కొరియా 2020 చివరి నాటికి 13,259 కొవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా, అవన్నీ ప్రతికూలంగా వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి కష్టపడుతుందని విశ్లేషకులు చెప్పారు.