ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య!
ABN , First Publish Date - 2022-05-13T09:09:54+05:30 IST
భర్తను ఏమార్చి ఇద్దరు ప్రియుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు ఊహించని షాకిచ్చాడో ప్రియుడు. ‘నన్ను పెళ్లిచేసుకో.. లేదంటే మన మధ్య జరిగిన నగ్న వీడియో కాల్స్ బయటపెడతా’ అంటూ బ్లాక్మెయిల్కు దిగేసరికి ఆమె కంగారెత్తిపోయింది..
వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి దుర్మార్గం
పెళ్లి చేసుకోవాలంటూ ఓ ప్రియుడి ఒత్తిడి
లేదంటే న్యూడ్ వీడియో కాల్స్ బయటపెడతానని హెచ్చరిక
మరో ప్రియుడితో కలిసి పథకం పన్నిన యువతి.. సుత్తితో కొట్టించి హత్య
నిందితుల్ని పట్టించిన హతుడి ఫోన్
మీర్పేటలో ఫొటోగ్రఫర్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు
హైదరాబాద్ సిటీ/సరూర్నగర్, మే 12(ఆంధ్రజ్యోతి): భర్తను ఏమార్చి ఇద్దరు ప్రియుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు ఊహించని షాకిచ్చాడో ప్రియుడు. ‘నన్ను పెళ్లిచేసుకో.. లేదంటే మన మధ్య జరిగిన నగ్న వీడియో కాల్స్ బయటపెడతా’ అంటూ బ్లాక్మెయిల్కు దిగేసరికి ఆమె కంగారెత్తిపోయింది. ఇంట్లో తెలిస్తే గొడవలైపోతాయని ఆందోళన చెంది ఆ ప్రియుడిని అంతం చేయించాలనుకుది. ఆ పనిని మరో ప్రియుడికి పురమాయించి పూర్తిచేయిచింది. ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున ఫొటోగ్రాఫర్ హత్య కేసు వెనుక మిస్టరీ ఇదీ! బాగ్అంబర్పేట్కు చెందిన మల్కాపురం యశ్మ కుమార్ (32) అనే యువకుడిపై ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి మీర్పేట్లోని నందిహిల్స్ చౌరస్తాలో దాడి జరగ్గా చికిత్స పొందుతూ రెండ్రోజుల తర్వాత మృతిచెందాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. విచారణలో విస్తుబోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
షాద్నగర్ సమీపంలోని కేశంపేట్కు చెందిన బి.విక్రమ్రెడ్డి, శ్వేతారెడ్డి (32) దంపతులు మీర్పేట్లోని ప్రశాంతిహిల్స్లో నివసిస్తున్నారు. విక్రమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. శ్వేత గృహిణి. 2018లో ఆమెకు ఫేస్బుక్లో యశ్మ కుమార్ పరిచయమయ్యాడు. అది ప్రేమగా మారి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తర్వాత ఫేస్బుక్లో పరిచయమైన ఏపీ కృష్ణాజిల్లాలోని ఎరుకోపాడుకు చెందిన కొంగళ్ల అశోక్(28) అనే యువకుడితోనూ ఆమె ప్రేమాయణం కొనసాగించింది. అతడు స్థానికంగానే ఓ ప్రైవేటు కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా పని చేసి గత నాలుగు నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. శ్వేత ప్రస్తుతం గర్భవతి. అయితే శ్వేతతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకొని దాచుకున్న యశ్మ కుమార్ వాటి ఆధారంగా ఆమెను కొన్నాళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ శ్వేతను బెదిరిస్తున్నాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే ప్రమాదం అని భావించిన శ్వేత, యశ్మ కుమార్ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
మరో ప్రియుడు అశోక్తో తనను యశ్మ కుమార్ అనే యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని.. అతడిని అంతం చేయాలని చెప్పింది. దీనికి అశోక్ అంగీకరించాడు. హత్య పథకం కోసం తన గ్రామానికి చెందిన స్నేహితుడు కార్తీక్ (30)తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నాడు. పథకంలో భాగంగా ఈ నెల 4న రాత్రి యశ్మ కుమార్కు శ్వేత ఫోన్ చేసి నందిహిల్స్కు రావాలని చెప్పింది. అక్కడికి బైక్ మీద యశ్మకుమార్ చేరుకున్నాడు. శ్వేత కోసం ఎదురుచూస్తూ బైక్ మీద కూర్చున్నాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అశోక్, కార్తీక్. వెనుక నుంచి వెళ్లి యశ్మకుమార్ తలపై మూడుసార్లు గట్టిగా కొట్టారు. అంతే.. అతడు తీవ్రగాయాలతో కిందపడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అతడిని రహదారిపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. అతడి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్ను తీసుకెళ్లాలనేది అశోక్, కార్తీక్ పథకం. అయితే యశ్వంత్ నుంచి ఫోన్ దూరంగా పడిపోవడంతో వారు వెతికినా దొరకలేదు. అంతలో ఆ దారిలో వాహనాల వస్తున్నట్లు శబ్దం రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న యశ్మకుమార్ను స్థానికులు గుర్తించి పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యశ్మ కుమార్ 6న మృతిచెందాడు. ఘటనాస్థలంలో మృతుడి మొబైల్ ఫోన్ను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు అందజేయగా దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లోని డేటా, కాల్లిస్టు, మెసేజ్లు, వీడియోల ఆధారంగా శ్వేతారెడ్డి కుట్ర బయటపడింది.