వ్యవసాయ యాంత్రీకరణలో ఈజిప్ట్ ముందున్నది: మంత్రి Niranjan reddy
ABN , First Publish Date - 2022-05-12T01:36:23+05:30 IST
వ్యవసాయ యాంత్రీకరణలో ఈజిప్ట్ ముందున్నదని, 5శాతం భూమి పై ఎన్నో అద్భుతాలుచేస్తున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(sigi reddy niranjan reddy) పేర్కొన్నారు
హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణలో ఈజిప్ట్ ముందున్నదని, 5శాతం భూమి పై ఎన్నో అద్భుతాలుచేస్తున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(sigi reddy niranjan reddy) పేర్కొన్నారు. ఇక్కడి రైతులు వ్యవసాయ పంటల నుండి ఉద్యాన పంటల ప్రాధాన్య తెలుసుకుని అటు వైపు మళ్లుతున్నారని ఈజిప్ట్ లో 95 శాతం ఎడారి ప్రాంతమని, అయినా యూరప్ దేశాలకు ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నారని అన్నారు. ఈజిప్ట్ (Egypt)రాజధాని కైరోలోని అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ (ARC) ని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి శాస్త్రవేత్తలు, అక్కడి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఆర్ సి ప్రెసిడెంట్ మహ్మద్ సోలిమన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మెగా హెడ్ హెచ్ అమ్మర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రీసెర్చ్ షిరీన్ అస్సెమ్, డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ సెరమ్ అండ్ వాక్సిన రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ అహ్మద్ సాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈజిప్ట్ లో 50 శాతం జనాభాకు 5 శాతం ఉన్న సాగుభూమి ఉపాధి కల్పిస్తున్నదని, ఇక్కడి ప్రధాన పంట గోధుమ అని తెలిపారు. ఈజిప్ట్ , తెలంగాణ వాతావరణం, వ్యవసాయ విధానాలు, ఊష్ణోగ్రతలు ఒకే విధంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.భారత్ లో, తెలంగాణలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికశాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు, సాగునీటి వసతి కలిపిస్తున్నారని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో వ్యవసాయరంగ ముఖచిత్రం మారుతున్నదని తెలిపారు. కైరో లోని అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ను కూడా మంత్రి సందర్శించారు. ఈజిప్ట్ వ్యవసాయ విధానాలు, ఎగుమతులు, సాగునీటి వసతులు, రైతుల పరిస్థితిపై ఆరాతీశారు. తెలంగాణ వ్యవసాయ విధానాలను, రైతుబంధు, రైతుభీమా పథకాలను అక్కడి అధికారులు శాస్త్రవేత్తలు అభినందించినట్టు తెలిపారు.వ్యవసాయ యాంత్రీకరణ, పంటల వైవిద్యీకరణపై తెలంగాణ రైతులను చైతన్యం చేస్తున్నామని చెప్పారు.