ఎల్టీఐ, మైండ్ట్రీ ఒక్కటవుతున్నాయ్..!
ABN , First Publish Date - 2022-05-07T06:54:48+05:30 IST
దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్ అండ్ టీ గ్రూప్నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్ట్రీ, ఎల్టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి...
దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరణ
‘ఎల్టీఐమైండ్ట్రీ’గా విలీన సంస్థకు నామకరణం
ముంబై: దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్ అండ్ టీ గ్రూప్నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్ట్రీ, ఎల్టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్టీఐమైండ్ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్లో భాగంగా మైండ్ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్ అండ్ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్ అండ్ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్ తెలిపారు.
మైండ్ట్రీ ప్రస్తుత సీఈఓ దేబాశిష్ ఛటర్జీ విలీన సంస్థ పగ్గాలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎల్టీఐ ప్రస్తుత సీఈఓ, ఎండీ సంజయ్ జలోనా వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎల్టీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.03 లక్షల కోట్లుగా ఉండగా.. మైండ్ట్రీ మార్కెట్ విలువ రూ.65,285 కోట్లుగా ఉంది. విలీనం తర్వాత ఎల్టీఐమైండ్ట్రీ.. టెక్ మహీంద్రాను దాటేసి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించనుంది. అలాగే, విలీన సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 80,000 దాటనుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టీసీఎస్ దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2019లో ఎల్ అండ్ టీ మైండ్ట్రీని బలవంతంగా టేకోవర్ చేసినప్పటి నుంచే ఎల్టీఐతో విలీనం చేయవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఓఎఫ్ఎస్ఎల్).. ఉద్యోగుల కోసం కాంపౌండింగ్ కంట్రిబ్యూటర్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సంస్థలో పదేళ్లకు పైగా విధులు నిర్వహించిన ఉద్యోగులను సత్కరించింది.
మ్యాట్రిమోనీ వెబ్సైట్ జీవన్సాథీ.. వినియోగదారులు తమ సరైన జోడిని అన్వేషించుకునేందుకు గాను ప్రత్యేకంగా ఫ్రీ చాట్ పేరుతో ఒక ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా తమ వెబ్సైట్ ద్వారా తమ ప్రొఫైల్స్ను ఉచితంగా షేర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
భారత్లో అతిపెద్ద సోలార్ మాడ్యూల్స్ తయారీదారు వారీ ఎనర్జీస్ లిమిటెడ్, అమెరికాకు చెందిన క్యూబిక్పీవీతో జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా వారీ ఎనర్జీస్కు క్యూబిక్ పీవీ ఏటా ఒక గిగావాట్ సిలివాన్ సెల్స్ను సరఫరా చేయనుంది.