పెళ్లి ఇష్టం లేక.. భర్తనే చంపించింది
ABN , First Publish Date - 2022-05-09T08:42:40+05:30 IST
ఆ యువతికి అతడితో పెళ్లి ఇష్టం లేదు.. వివాహమైనా ప్రియుడి పైనే ధ్యాసంతా..
- ప్రియుడు, అతడి స్నేహితులు, బంధువులతో పన్నాగం..
- వివాహమైన నెలకే సిద్దిపేట జిల్లాలో యువతి దుశ్చర్య
- దేవుడి మొక్కు తీర్చుకుందామంటూ ఆలయానికి తీసుకెళ్లి దురాగతం
- పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపించినట్లు వెల్లడి
- అంతకు 10 రోజుల ముందే భోజనంలో ఎలుకల మందు
సిద్దిపేట క్రైం, మే 8: ఆ యువతికి అతడితో పెళ్లి ఇష్టం లేదు.. వివాహమైనా ప్రియుడి పైనే ధ్యాసంతా..! ఎలాగైనా భర్తను చంపించి ప్రియుడితో ఉండిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో భారీ పన్నా గం పన్నింది. కట్టుకున్నవాడిని దారుణంగా హత్య చేయించి.. కట్టు కథ అల్లింది. ఇదంతా పెళ్లయిన నెల రోజులకే జరిగింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు, దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామ యువకుడు, ప్లంబింగ్ పనిచేసే కోనాపురం చంద్రశేఖర్తో మార్చి 23న వివాహం జరిగింది. శ్యామలకు తన గ్రామానికి చెందిన శివతో ప్రేమ వ్యవహారం ఉంది. దీంతో భర్తను చంపి శివతో వెళ్లిపోదామని నిర్ణయించుకుంది. గత నెల 19న భర్త భోజనంలో ఎలుకల మందు కలిపింది. చంద్రశేఖర్ తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. దీంతో శ్యామల శివతో కలిసి మరో కుట్ర పన్నింది. శివ గుడికందులకు చెందిన స్నేహితులు రాకేష్, రంజిత్, సిరిసిల్లకు చెందిన బంధువులు సాయికృష్ణ, భార్గవ్లకు తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి చంద్రశేఖర్ హత్యకు సాయం కోరింది.
పెళ్లికి పెట్టిన వాహనంపై..
పథకంలో భాగంగా.. శ్యామల తనకు అనంతసాగర్ సరస్వతి గుడిలో మొక్కు తీర్చుకుందామని భర్త చంద్రశేఖర్ను కోరింది. ఇద్దరూ ఏప్రిల్ 28న తమ పెళ్లికి పెట్టిన వాహనంపై బయల్దేరారు. సిద్దిపేట వెంకటేశ్వర గుడిలో దర్శనం తర్వాత అనంతసాగర్ పయనమయ్యా రు. అయితే, అప్పటికే అనంతసాగర్ శివారు బ్రాహ్మణ అగ్రహారం సొసైటీ దారిలో నిర్మానుష్య ప్రదేశంలో శివ తన ఇద్దరు స్నేహితులు, ఇద్దరు బంధువులతో కారులో వేచి ఉన్నాడు. తమ లొకేషన్ను శ్యామలకు షేర్ చేశా డు. వారు వస్తున్నది గమనించి కారుతో అడ్డగించాడు. చంద్రశేఖర్ను కిందపడేశాడు. రంజిత్, రాకేష్, సాయికృష్ణ, భార్గవ్లు చంద్రశేఖర్ కాళ్లు, చేతులు పట్టుకోగా, శివ టవల్తో చంద్రశేఖర్ మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నిందితులు..మృతదేహాన్ని, శ్యామలను కారులో సిద్దిపేట వీరహనుమాన్ నగర్ వద్ద వదిలేశాడు. చంద్రశేఖర్ వాహనాన్ని నిందితుల్లోని మరో యవకుడు అక్కడకు తీసుకొచ్చాడు.
భర్తకు గుండెపోటు అని చెప్పి
వీరహనుమాన్ నగర్ నుంచి శ్యామల తన అత్త మనవ్వకు ఫోన్ చేసింది. భర్త చంద్రశేఖర్కు ఛాతీలో నొప్పి వస్తుందని, భయమేస్తుందని చెప్పింది. కాసేపటికి ఫోన్ చేసి చనిపోయాడని తెలిపింది. అయితే, అదే రోజు మనవ్వ తన కొడుకు మృతిపై అనుమానం ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో చంద్రశేఖర్ ఊపిరాడక చనిపోయాడని తేలింది. పోలీసులు శ్యామలను విచారించగా నేరం ఒప్పుకొంది. బైక్ను, కారును సీజ్ చేసి శ్యామల, శివతో పాటు మిగతా నలుగురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. కాగా, శివ సిద్దిపేటలోని ఓ ప్రయివేటు డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు. నిందితుల్లో ఒకరు ఇతడి క్లాస్మేట్ అని తెలిసింది.