జరిమానాకు ‘లైసెన్స్‌’

ABN , First Publish Date - 2022-05-14T06:14:21+05:30 IST

రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్రైవింగ్‌ లైసెన్సులు లేక జిల్లాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుని టెస్టు పాసైన వెంటనే కార్డులు ఇవ్వాల్సి ఉంది. పోలీసుల తనిఖీల సమయంలో ఈ కార్డులను చూపాల్సి ఉంది. సుమారు ఒకటిన్నర సంవత్సరంగా ఆర్‌సీ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సు కార్డులు ఇవ్వడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కార్డుల పంపిణీకి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదని వాహనదారులు వాపోతున్నారు.

జరిమానాకు ‘లైసెన్స్‌’

ఏడాదిగా అందని డ్రైవింగ్‌ లెసెన్సులు  

పట్టించుకోని అధికారులు

పోలీసుల తనిఖీల్లో ఇబ్బంది పడుతున్న వాహనదారులు


జిల్లాలో రోడ్డు రవాణా శాఖ అధికారుల తీరు జరిమానాలకు లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి 15వేలకు పైగా ఆర్సీలు, 12వేలకు పైగా డ్రైవింగ్‌ లెసెన్సులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కార్డుల సరఫరా లేకపోవడంతో వీటిని ఇవ్వలేకపోతున్నామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వాహనంతో రోడ్డెక్కితే చాలు.. ఎక్కడోచోట తనిఖీల పేరుతో ఆపే పోలీసులు ఆర్సీ, డ్రైవింగ్‌ లెసెన్స్‌ లేదని జరిమానా విధిస్తున్నారు. టెస్ట్‌ పాసై, డ్రైవింగ్‌ లైసెన్స్‌కోసం డబ్బుకట్టినా తమకు జరిమానాలు తప్పడం లేదని వాహనదారులు వాపోతున్నారు.

సీకేదిన్నె, మే 13: రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్రైవింగ్‌ లైసెన్సులు లేక జిల్లాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుని టెస్టు పాసైన వెంటనే కార్డులు ఇవ్వాల్సి ఉంది. పోలీసుల తనిఖీల సమయంలో ఈ కార్డులను చూపాల్సి ఉంది. సుమారు ఒకటిన్నర సంవత్సరంగా ఆర్‌సీ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సు కార్డులు ఇవ్వడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కార్డుల పంపిణీకి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదని వాహనదారులు వాపోతున్నారు.

పెండింగ్‌లో 15 వేలకు పైగా ఆర్సీలు

2021 డిసెంబరు నుంచి జిల్లా వ్యాప్తంగా 15 వేలకు పైగా ఆర్సీ కార్డులు వాహనదారులకు అందాల్సి ఉంది. వీరంతా వాహనం తమదేనని చూపేందుకు ఎటువంటి ఆధారాలు లేక నిత్యం వాహనం ఇంటి నుంచి బయటకు తీసినప్పటి నుంచి పోలీసు తనిఖీల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. జరిమానాలు కట్టలేక, ఎవరికీ చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు.

12 వేలకుపైగా డ్రైవింగ్‌ లైసెన్సులు పెండింగ్‌

ఉమ్మడి జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రాయచోటి ఆర్టీవో కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 12 వేలకుపైగా డ్రైవింగ్‌ లైసెన్సులు 2021 సెప్టెంబరు నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే పోలీసులు తనిఖీల్లో జరిమానా విధిస్తున్నారు. లైసెన్స్‌కోసం వాహనదారులు రూ.960 ఈ-సేవ ద్వారా చెల్లించారు. టూవీలర్‌కు రూ.960, ఫోర్‌ వీలర్‌కు రూ.960, రెండిటికీ కలిపి అయితే రూ.1260 చెల్లించాల్సి ఉంది. డబ్బు చెల్లించిన వారు 12వేలకు పైగా ఉన్నారు. ఒక్కో లైసెన్సుకోసం రూ.960 చొప్పున లెక్కేసినా వాహనదారులు ప్రభుత్వానికి కట్టిన మొత్తం రూ.1,15,20,000. అంటే వాహనదారులు రూ.1.15 కోట్లు చెల్లించినా ఏడాదిన్నరగా వీరికి డ్రైవింగ్‌ లైసెన్సు కార్డులు చేతికందలేదు. తమ తప్పు లేకపోయినా అనవసరంగా డబ్బులు ఫైన్ల రూపంలో కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

రోజుకు 85 కొత్త లైసెన్సులకు దరఖాస్తులు

ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా లైసెన్సుకోసం సుమారు 85 కొత్త దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి రోజు రోజుకు పేరుకు పోతున్నాయే కానీ కార్డులు మాత్రం అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఆర్సీలు, డ్రైవింగ్‌ లైసెన్సులు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


పోలీసుల తనిఖీలతో ఇబ్బందులు..

తరచూ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల ఆర్సీలు, డ్రైవింగ్‌ లైసెన్సుల పరిశీలిస్తున్నారు. లైసెన్స్‌ లేనివారికి జరిమానా విధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రైవింగ్‌ లైసెన్సులు అందించి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలి. వాహనదారుల వద్ద డబ్బు తీసుకున్నప్పటికీ ఇన్ని రోజులు పెండింగ్‌లో పెట్టడం సరైంది కాదు.

- రామమోహన్‌రెడ్డి, మానవ హక్కుల సంఘం నేత 


ప్రభుత్వం నుంచి సరఫరా లేదు..

ప్రభుత్వం నుంచి 6 నెలలుగా కార్డులు సరఫరా లేకపోవడంతో వాహనదారులకు పంపిణీ చేయాల్సిన ఆర్సీలు,  డ్రైవింగ్‌ లైసెన్సులు పెండింగ్‌ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన వెంటనే కార్డులు ప్రింట్‌ చేసి వాహనదారులకు అందిస్తాం.

- నాగేశ్వరరావు, డీటీసీ, కడప

Read more