కుదేలైన అన్నదాత

ABN , First Publish Date - 2022-05-03T05:02:33+05:30 IST

Fallen Mango Trees in Perampalle

కుదేలైన అన్నదాత
పేరంపల్లెలో నేలకొరిగిన మామిడి చెట్లు

గాలి, వాన బీభత్సం

పలుచోట్ల మామిడి, అరటితోటలు ధ్వంసం 

సుండుపల్లె, మే 2: ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇందులో భాగంగా మండల వ్యాప్తంగా సుమారు 1170 హెక్టార్లలో మామిడి పంట దెబ్బతిందని అధికారులు చెబుతున్నారు. ఉన్నట్టుండి ఈదురుగాలులు, వర్షాలు రావడంతో చేతికి వచ్చిన పంట చేజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సోమవారం ఉద్యానవనశాఖ అధికారులు రవీంద్రనాధరెడ్డి, ఏఈలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న మామిడి పంటను పరిశీలించారు. నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తా మని తెలిపారు. 


గాలివీడులో: ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు వివిధ రకాల చెట్లు నేలకొరిగాయి. ముఖ్యంగా మామిడితోటల సాగు రైతులకు అపార నష్టం వాటిల్లింది. మామిడి కాయలన్నీ నేలకొరిగాయి. ముఖ్యంగా గొట్టివీడు, గోరాన్‌చెరువు, పేరంపల్లె, గోపనపల్లె, గాలివీడు, అరవీడు పంచాయతీల్లో ఎక్కువుగా ఈదురుగాలులు వీయగా నూలివీడు, సీసీపల్లె, గుండ్లచెరువు తదితర గ్రామాల్లో కొద్దిపాటి గాలులు వీచాయి. మొత్తం మండలంలో 50 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు సమాచారం. 


సంబేపల్లెలో: మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు మామిడి నేలరాలింది. మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దుద్యాల గురిగింజకుంట, గున్నికుంట్ల గ్రామాల్లోని మామిడితోటల్లో నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. శెట్టిపల్లె గ్రామం గాండ్లపల్లె సమీపంలో పాగేటి గంగమ్మ ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డుపై రేకులు ఈదురుగాలులకు ఎగిరిపడ్డాయి. సుమారు రూ.లక్ష ఖర్చు చేసి నిర్మాణం చేపట్టినట్లు ఆలయ ధర్మకర్త సహదేవ తెలిపారు. 


రైల్వేకోడూరులో: పట్టణంలో ఆదివారం రాత్రి వీచిన పెనుగాలులకు రేకుల షెడ్ల పై కప్పులు లేచిపోయాయి. మండలంలోని అనంతరాజుపేటలో ఓ దుకాణం రేకులు నేలకూలాయి. రైల్వేకోడూరు పట్టణంలోని రంగనాయకులపేటలో పశువులకు వేసిన రేకుల షెడ్డు కూలిపోయింది. 


చిన్నమండెంలో: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. కోత దశలో ఉన్న వరిపైర్లు సైతం నేలకొరిగాయి. ఉద్యాన పంటలైతే అధిక శాతం దెబ్బతిన్నట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాని హెచ్‌వో వనితభాయ్‌ తెలిపారు. 


చిట్వేలిలో: అకాల వర్షంతో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం, గాలివాన బీభత్సానికి అరటితోటలు ధ్వంసం కాగా మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఉద్యానవన శాఖ అధికారిణి ఆసియా అందించిన మేరకు వివరాలిలా... మండల పరిధిలోని తుమ్మకొండ, నేతివారిపల్లె, నాగవరం పంచాయతీల్లో 17 ఎకరాల్లో అరటితోటలు ధ్వంసమ య్యాయి. అలాగే అక్కడక్కడ మామిడి కాయలు నేలరాలాయి. కోతకు వచ్చే సమయంలో అరటితోటలు ధ్వంసం కావడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించి నష్టపరిహారం అందించేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. 







Read more