కిసాన్ సమ్మాన్ నిధికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి
ABN , First Publish Date - 2022-05-10T05:30:00+05:30 IST
రైతులకు పెట్టుబడి సాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు రూ. 6వేలు పెట్టుబడి సాయం అందజేస్తుంది.
ఈ నెల 31 వరకు గడువు
సిద్దిపేట అగ్రికల్చర్, మే 10: రైతులకు పెట్టుబడి సాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు రూ. 6వేలు పెట్టుబడి సాయం అందజేస్తుంది. రూ. 2 వేల చొప్పున మూడు విడతలుగా రైతు ఖాతాలో జమచేస్తారు. ప్రస్తుతం రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. ఇందుకోసం ఈ నెల 31 వరకు గడువు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుసంధానం చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది.
అనుసంధానం చేసుకోండి ఇలా..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత డబ్బులు రైతు ఖాతాల్లో జమ కావాలంటే కేవైసీ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా, పట్టాదార్ పాస్బుక్తో రైతులు మీసేవ కేంద్రాల్లో సంప్రదిస్తే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అలాగే, మండల వ్యవసాయ అధికారుల ద్వారా, పీఎం కిసాన్పోర్టల్ యాప్ ద్వారా లేదా స్మార్ట్ఫోన్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన లింకు ద్వారా కైవైసీ పూర్తిచేసుకునే వీలున్నది.
వ్యవసాయమే ప్రధాన ఆధారం
సిద్దిపేట జిల్లాలో ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో 2.79 లక్షల మంది రైతులు ఉన్నారు. వానాకాలం 5 లక్షల ఎకరాల్లో, యాసంగి 3 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, వేరుశనగ, కూరగాయలు ప్రధాన పంటలు.