గ్రేటర్లో నిరాశ్రయుల నీళ్ల కష్టాలు తీర్చాలి..KCR దీనికి జవాబు ఉందా?: విజయశాంతి
ABN , First Publish Date - 2022-05-08T21:56:02+05:30 IST
గ్రేటర్లో నిరాశ్రయుల నీళ్ల కష్టాలు తీర్చాలి..KCR దీనికి జవాబు ఉందా?: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ CM Kcrపై బీజేపీ నాయకురాలు విజయశాంతి (vijayashanthi) విమర్శలు గుప్పించారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మొత్తానికి మంచి నీటి సరాఫరా చేస్తున్నామని చెప్పుకునే కేసీఆర్ దగ్గర దీనికి జవాబుందా? అని విజయశాంతి ప్రశ్నించారు. గొప్పలు పక్కన పెట్టి గ్రేటర్లోని నిరాశ్రయుల నీళ్ల కష్టాలు తీర్చాలని ఆమె డిమాండ్ చేశారు. బల్దియా అధికారులు భాగ్యనగరంలోని నిరాశ్రయుల నీళ్ల కష్టాలు అసలు పట్టించుకోవడం లేదని, వేర్వేరు రాష్ట్రాలు, జిల్లాల నుంచి జంటనగరాలకు వలసొచ్చిన వారు నీళ్లు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని విజయశాంతి తెలిపారు. ఇంటి అద్దెలు కట్టే స్థోమత లేక రోడ్లు, నాలాల వెంట గుడిసెలు వేసుకొని గ్రేటర్ పరిధిలో చాలామంది జీవనం సాగిస్తున్నారని ఆమె చెప్పారు. గతంలో కొన్నిచోట్ల బజారు నల్లాలు ఉండేవని, ఆఫీసర్లే వాటిని తొలగించారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలి ఎండీ వీరినీ పట్టించుకుంటే బాగుంటుందని, ఇప్పటికైనా బల్దియా అధికారులు వీరికీ నీటి సరాఫరా చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ యథాతథంగా..
''బల్దియా అధికారులు భాగ్యనగరంలోని నిరాశ్రయుల నీళ్ల కష్టాలు అసలు పట్టించుకోవడం లేదు. వేర్వేరు రాష్ట్రాలు, జిల్లాల నుంచి జంటనగరాలకు వలసొచ్చిన వారు నీళ్లు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు కట్టే స్థోమత లేక... రోడ్లు, నాలాల వెంట గుడిసెలు వేసుకొని గ్రేటర్ పరిధిలో చాలామంది జీవనం సాగిస్తున్నారు. ఆయా ఏరియాల్లో బజారు నల్లాలు లేక నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నరు. నల్లా ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి నీళ్లు అడుక్కొచ్చుకుంటున్నారు. ఎండా కాలంలో చాలామంది తమకే నీళ్లు చాలట్లేదంటున్నరని బాధితులు చెబుతున్నరు. దీంతో మంచినీటి కోసం బిందెలతో వేరే ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నరు. కాలనీల్లో రోడ్ల పక్కన ఉన్న చేతి పంపులు పని చేయడం లేదని, కనీసం వాటిని రిపేర్ చేసినా తమకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నరు. ఇలాంటి వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన జలమండలి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. గతంలో కొన్నిచోట్ల బజారు నల్లాలు ఉండేవని, ఆఫీసర్లే వాటిని తొలగించారు. చలివేంద్రాలకు నీటిని ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించిన జలమండలి ఎండీ, వీరినీ పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా బల్దియా అధికారులు వీరికీ నీటి సరాఫరా చేయాలి. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రం మొత్తం మంచి నీటి సరాఫరా చేస్తున్నమని చెప్పుకునే కేసీఆర్ గారి దగ్గర దీనికి జవాబుందా? గొప్పలు పక్కన పెట్టి గ్రేటర్లోని నిరాశ్రయుల నీళ్ల కష్టాలు తీర్చాలి.'' అని విజయశాంతి అన్నారు.