Karunanidhi సమాధిపై ఆలయ గోపుర నమూనా
ABN , First Publish Date - 2022-05-05T16:18:03+05:30 IST
నాస్తికుడైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సమాధిపై తమిళనాడు దేవాదాయశాఖ మంత్రి శేఖర్బాబు ఆలయ గోపుర నమూనా పెట్టి అంజలి ఘటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
చెన్నై: నాస్తికుడైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సమాధిపై తమిళనాడు దేవాదాయశాఖ మంత్రి శేఖర్బాబు ఆలయ గోపుర నమూనా పెట్టి అంజలి ఘటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బుధవారం శాసనసభలో హిందూ దేవాదాయశాఖ పద్దులపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొనేందుకు శాసనసభకు బయలుదేరిన మంత్రి శేఖర్బాబు.. ముందుగా మెరీనాలోని కరుణ సమాధి వద్దకు వెళ్లారు. అప్పటికే సమాధిపై ఆలయ గోపుర నమూనా పెట్టివుండగా, ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన మంత్రి.. శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. 2018 ఆగస్టులో మృతిచెందిన కరుణానిధికి మెరీనా తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ 2.21 ఎకరాల విస్తీర్ణంలో కరుణ స్మారక మండపం నిర్మితమవుతోంది.